దళితుల శ్మశానం ఆక్రమణ

ABN , First Publish Date - 2021-10-30T04:57:00+05:30 IST

దళితులు శ్మశాన స్థలం కోసం ఆందోళన చేయాల్సి వస్తోంది.

దళితుల శ్మశానం ఆక్రమణ
దళితుల మృతదేహాలను పూడ్చుతున్న భూమి

  1. గగ్గటూరులో మృతదేహాల పూడ్చివేతకు ఇబ్బందులు
  2. దశాబ్దాలుగా ఖననం జరుగుతున్న స్థలంలో అడ్డంకులు


పాణ్యం, అక్టోబరు 29: దళితులు శ్మశాన స్థలం కోసం ఆందోళన చేయాల్సి వస్తోంది. పాణ్యం మండలంలోని గగ్గటూరులోని దళితుల శ్మశాన స్థలాన్ని  కొందరు ఆక్రమించారు. గ్రామంలోని 24/3 సర్వే నెంబరులోని 0.90 సెంట్ల వ్యవసాయ భూమిని దళితులు శ్మశానంగా వాడుతున్నారు. ఆ భూమిని ఇద్దరు రైతులు పంచుకొని అక్కడ మృతదేహాలు పూడ్చవద్దని అన్నారు. ఏన్నో యేళ్లుగా మృతదేహాలు పూడ్చే స్థలంలో వద్దని ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని  దళితులు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యను తహసీల్దారు రత్నరాధిక దృష్టికి తీసుకువెళ్లగా సమస్య తన దృష్టికి రాలేదన్నారు. వీఆర్‌ఓ రంగన్న మాట్లాడుతూ 24/3 సర్వే నెంబరులో పూర్తి విస్తీర్ణం 1. 80 ఎకరాలు పట్టా భూమిగా ఆర్‌ఎ్‌సఆర్‌, ఆర్‌ఓఆర్‌, అడంగల్‌లో నమోదైందన్నారు. ఇందులో నలుగురు రైతులు సాగు చేసుకుంటున్నారన్నారు.


శ్మశాన స్థలం కేటాయించండి 

గ్రామంలో 30 ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. ఇంత వరకు 24/3 సర్వే నెంబరులోని వ్యవసాయ భూమిలో తమ మృతదేహాలను పూడ్చుకుంటున్నాం. ప్రస్తుతం ఇద్దరు రైతులు భూమిని పంచుకోవడంతో సమస్య ఏర్పడింది. ప్రభుత్వ అధికారులు  సమస్యను పరిష్కరించాలి.

- విజయకుమార్‌, గగ్గటూరు 


 అధికారులు స్పందించాలి 

 దళితుల శ్మశాన స్థలం సమస్యపై అధికారులు వెంటనే స్పం దించాలి. గ్రామంలో ప్రభుత్వ మిగులు భూమి లేనిపక్షంలో పట్టా స్థలం కొనుగోలు చేసి శ్మశానానికి స్థలం కేటాయించాలి. రెవెన్యూ అధికారులు గ్రామంలోని ప్రభుత్వ మిగులు భూమి వివరాలు గ్రామ ప్రజలకు తెలపాలి.

- మోహన్‌రెడ్డి, టీడీపీ నాయకుడు, గగ్గటూరు 


 సమస్య పరిష్కారానికి కృషి 

 గ్రామంలోని దళితుల శ్మశాన సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తా. పట్టా రైతులతో చర్చించి స్థలం కేటాయించే వరకు మృత దేహాలను అదే స్థలంలో పూడ్చేలా కోరుతా. దళితుల శ్మశాన సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం.

- పద్మావతి, సర్పంచ్‌, గగ్గటూరు 



Updated Date - 2021-10-30T04:57:00+05:30 IST