రోడ్డు ఆక్రమణ!

ABN , First Publish Date - 2021-07-27T04:14:10+05:30 IST

వ్యవసాయ ఉత్పత్తుల తరలింపునకు రైతులు వినియోగిస్తున్న రహదారినే కబ్జా చేశారు. అంతటితో ఆగకుండా చెంతనే ఉన్న చెరువు గట్లను సైతం ధ్వంసం చేశారు.

రోడ్డు ఆక్రమణ!
రహదారిని తవ్వేసిన దృశ్యం




చెరువు గట్టు ధ్వంసం

చిననడిపల్లిలో వెలుగుచూసిన కబ్జా పర్వం

(చీపురుపల్లి)

వ్యవసాయ ఉత్పత్తుల తరలింపునకు రైతులు వినియోగిస్తున్న రహదారినే కబ్జా చేశారు. అంతటితో ఆగకుండా చెంతనే ఉన్న చెరువు గట్లను సైతం ధ్వంసం చేశారు. చిననడిపల్లిలో వెలుగుచూసింది ఈ కబ్జా పర్వం. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో అందరూ చిన్న, సన్నకారు రైతులే. వారు పండించిన వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు సరైన మార్గం లేక ఇబ్బంది పడేవారు. ఈ నేపథ్యంలో 2003లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పనికి ఆహార పథకం కింద రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. రోడ్డు నిర్మాణానికి తలపెట్టిన భూమి డీ పట్టా. అంతకు ముందే కొంతమందికి ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో గ్రామస్థులు, రైతుల విన్నపం మేరకు సర్వే నంబర్‌ 60లోని డీ పట్టా భూమిని రోడ్డు నిర్మాణానికి ఇచ్చేందుకు సదరు వ్యక్తులు ఒప్పుకున్నారు. పొలాలకు రాకపోకలకు ఈ రోడ్డు అనువుగా ఉండేది. అయితే సుమారు రెండు దశాబ్దాలు దాటిన తరువాత ఇది మా భూమి అంటూ సదరు వ్యక్తులు రోడ్డును తవ్వేసి తమ భూమిలో కలిపేసుకున్నారు. పక్కనే ఉన్న రాతి చెరువు గట్టును సైతం తవ్వేసి ఆ భూమిని కలుపుకున్నారు. దీంతో పొలాలకు వెళ్లేందుకు రైతులకు మార్గం లేకుండా పోయింది. ఈ మొత్తం వ్యవహారంలో ఓ నాయకుడి హస్తం ఉన్నట్టు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. దీనిపై తహసీల్దారు పీవీ శ్యామసుందరరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా ఈ విషయం తమ దృష్టికి రాలేదన్నారు. సిబ్బందిని పంపి విచారణ చేపడతామని చెప్పారు. 


Updated Date - 2021-07-27T04:14:10+05:30 IST