లక్ష్మణ్ నాయక్ జన్మ స్థలంలో మానవ హక్కులను కాపాడుతున్నాం : ఒడిశా
ABN , First Publish Date - 2021-06-13T18:03:41+05:30 IST
స్వాతంత్ర్య సమర యోధుడు లక్ష్మణ్ నాయక్ జన్మ స్థలం
భువనేశ్వర్ : స్వాతంత్ర్య సమర యోధుడు లక్ష్మణ్ నాయక్ జన్మ స్థలం తెంతులిగుమ్మలో మానవ హక్కులను కాపాడుతున్నట్లు ఒడిశా ప్రభుత్వం జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)కి ఆదివారం తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయవాది రాధాకాంత త్రిపాఠీ దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ జారీ చేసిన ఆదేశాలపై స్పందిస్తూ, కోరాపుట్ జిల్లా కలెక్టర్ ఈ సమాచారాన్ని అందజేశారు.
రాధాకాంత త్రిపాఠీ ఎన్హెచ్ఆర్సీకి సమర్పించిన పిటిషన్లో తెలిపిన వివరాల ప్రకారం, ఒడిశాలోని కోరాపుట్ జిల్లా తెంతులిగుమ్మలో లక్ష్మణ్ నాయక్ జన్మించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఆయనను బ్రిటిషర్లు హత్య చేశారు. ఈ గ్రామం కోరాపుట్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలోనూ, మల్కన్గిరి పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. బ్లాక్ ప్రధాన కేంద్రం బోయిపరిగూడకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి ప్రజలు ఆరోగ్య సేవల కోసం మథిలీలోని ఆరోగ్య కేంద్రంపైనే ఆధారపడవలసి వస్తోంది. ఇది ఈ గ్రామానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ చేరుకునే అవకాశం లేదు. గర్భిణులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎటువంటి వైద్య సహాయం అందకుండానే ప్రసవాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. బాలలు విద్యకు దూరమవుతున్నారు. వృద్ధులు ఆర్థిక బాధల్లో జీవిస్తున్నారు. దివ్యాంగుల పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. రోడ్లు, తాగు నీరు, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు లేవు.
ఈ పిటిషన్పై ఎన్హెచ్ఆర్సీ స్పందించి, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు పంపించింది. దీనిపై స్పందించిన కోరాపుట్ జిల్లా కలెక్టర్ ఎన్హెచ్ఆర్సీకి ఓ నివేదికను సమర్పించారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల మౌలిక మానవ హక్కులను కాపాడటం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.