కన్నతల్లి కర్కశత్వం: కొడుకును కారుతో తొక్కించి.. ఆపై మృతదేహాన్ని..

ABN , First Publish Date - 2021-03-03T00:16:11+05:30 IST

పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ పట్ల ఓ తల్లి కర్కశత్వంగా ప్రవర్తించిన ఉదాంతమిది.

కన్నతల్లి కర్కశత్వం: కొడుకును కారుతో తొక్కించి.. ఆపై మృతదేహాన్ని..

ఒహియో: పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ పట్ల ఓ తల్లి కర్కశత్వంగా ప్రవర్తించిన ఉదాంతమిది. కన్న కొడుకును కారుతో తొక్కించి చంపేసిన ఆ కసాయి తల్లి.. అనంతరం ఆ మృతదేహాన్ని అదే కారులో ఇంటికి తీసుకొచ్చింది. ఒకరోజు మొత్తం ఇంట్లో ఉంచుకుని.. ఆ తర్వాతి రోజు తీసుకెళ్లి ఓ నదిలో పడేసింది. ఈ హృదయవిదారక ఘటన అమెరికాలోని ఒహియోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒహియోలోని మిడిల్‌టౌన్‌లో నివాసముండే బ్రిటానీ గోస్నీ(29) అనే మహిళ.. తన 6 ఏళ్ల కుమారుడు జేమ్స్ రాబర్ట్ హుచిసన్‌ను ప్రియుడు జేమ్స్ హమిల్టన్ సహాయంతో చంపేసింది. అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి నదిలో పడేసింది. ఆ తర్వాత ఏం తెలియనట్టుగా వెళ్లి తన కుమారుడు కనిపించడం లేదని ఆదివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు హుచిసన్ కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా వెతికారు. కానీ, ఎక్కడ అతని జాడ దొరకలేదు. ఈ క్రమంలో తల్లి గోస్నీ ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చింది. దాంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించారు. పోలీసుల విచారణలో గోస్నీ తానే తన కుమారుడిని చంపేసినట్లు అంగీకరించింది. ప్రియుడు జేమ్స్ హమిల్టన్ సహాయంతో హుచిసన్‌ను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి.. కారుతో తొక్కించి చంపేసినట్లు తెలిపింది. ఆ తర్వాత మృతదేహాన్ని అదే కారులో ఇంటికి తీసుకొచ్చి.. ఆ తర్వాతి రోజు తీసుకెళ్లి దగ్గరిలోని నదిలో పడేసినట్లు చెప్పింది. దీంతో పోలీసులు గోస్నీతో పాటు ఆమెకు సహకరించిన ప్రియుడు హమిల్టన్‌పై హత్య, శవాన్ని మాయం చేయడం కింద కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. ప్రస్తుతం హుచిసన్ మృతదేహం కోసం గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో వెతుకుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.          

Updated Date - 2021-03-03T00:16:11+05:30 IST