ఓఎల్ఎక్స్లో సోఫా పేరుతో రూ. 4.6 లక్షలు మోసం
ABN , First Publish Date - 2021-03-16T14:06:48+05:30 IST
రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నగరానికి చెందిన ఓ ప్రైవేటు సంస్థ
- షేర్మార్కెట్లో పెట్టుబడి పేరుతో మోసం చేసిన ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్ : రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నగరానికి చెందిన ఓ ప్రైవేటు సంస్థ మెయిల్ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు సంస్థ.. డబ్బులు కావాలంటూ పార్ట్నర్లకు సందేశాలు పంపారు. ఈ విషయం గ్రహించిన సంస్థ ప్రతినిధులు మెయిల్ హ్యాక్చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో సంఘటనలో ఓఎల్ఎక్స్లో సోఫాలు తక్కువ ధరకే అమ్ముతామంటూ రూ. 4.6 లక్షలు సైబర్ నేరగాళ్లు కాజేశారు. బాధితులకు నమ్మకం కలిగించి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయించి ఖాతాను ఖాళీచేశారు. బాధితుడు సైబర్ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులు అందుకున్న సైబర్ క్రైం పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇద్దరు మోసగాళ్ల అరెస్ట్
షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే 15 శాతం వడ్డీ ఇస్తామంటూ ఆశచూపి పలువురి నుంచి లక్షలాది రూపాయలు కొల్లగొట్టిన బిహార్కు చెందిన రాహుల్కుమార్, జార్ఖండ్కు చెందిన శ్వేతన్కుమార్లను సైబర్క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. శాలిబండకు చెందిన ఇద్దరు వ్యక్తులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన సైబర్క్రైం పోలీసులు సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.