దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమైక్రాన్?
ABN , First Publish Date - 2021-12-21T15:14:02+05:30 IST
దుబాయ్ నుంచి కన్నియాకుమారికి వచ్చిన ఒక వ్యక్తికి ఒమైక్రాన్ వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు. ఆయనకు ఎయిర్పోర్టులో జరిపిన పరీక్షల్లో కరోనా వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆయన
అడయార్(చెన్నై): దుబాయ్ నుంచి కన్నియాకుమారికి వచ్చిన ఒక వ్యక్తికి ఒమైక్రాన్ వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు. ఆయనకు ఎయిర్పోర్టులో జరిపిన పరీక్షల్లో కరోనా వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆయన శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించారు. అలాగే, ఇదే జిల్లాలోని నాగర్కోయిల్లో ఒకే తరగతికి చెందిన ఆరుగురు విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. దుబాయ్ నుంచి తిరువనంతపురం వచ్చి అక్కడ నుంచి కన్నియాకుమారి జిల్లాలోకి ప్రవేశించిన పట్టుక్కోట ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేశారు. ఇందులో అతనికి పాజిటివ్ అని తేలడంతో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ఒమిక్రాన్ నిర్థారణ పరీక్షలు చేశారు. ఈ ఫలితాలు రావాల్సి ఉంది.
సమయపురంలో ఏడుగురు విద్యార్థులకు...
తిరుచ్చి సమీపం సమయపురంలోని ప్రైవేటు మెట్రిక్యులేషన్ పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ పాఠశాలలోని ప్లస్ వన్, ప్లస్ టూ విద్యార్థుల వసతి గృహంలోని ఐదుగురు సహా ఏడుగురు అస్వస్థతకు గురికావడంతో వారికి వైద్యపరీక్షలు నిర్వహించగా, కరోనా లక్షణాలు బయల్పడ్డాయి. దీంతో పాఠశాలకు ఈనెల 25వ తేదీ వరకు నిర్వాహకులు సెలవులు ప్రకటించగా, పాఠశాలల్లోని 600 మంది విద్యార్థినీ, విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు.
సీరాతోపు పాఠశాలలో...
సీరాతోపులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థినికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో, విద్యార్థిని చదువుతున్న తరగతికి మాత్రమే ఈనెల 23వ తేదీ వరకు సెలవు ప్రకటించారు.