ఒమైక్రాన్ ప్రభావంపై పరిశోధనలు చేయాలి
ABN , First Publish Date - 2021-12-26T17:59:19+05:30 IST
డెల్టా వైరస్ తర్వాత కరోనా కొత్తవేరియంట్ ఒమైక్రాన్ ప్రభావం పెరిగిపోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 31 మందికి వైరస్ నిర్ధారణ అయింది. టాస్క్ఫోర్స్ కమిటీ ఒమైక్రాన్ నియంత్రణపై నిరంతరం సమీక్షలు చేస్తోంది. ఈ
- ప్రభుత్వానికి టాస్క్ఫోర్స్ కమిటీ సూచన
బెంగళూరు: డెల్టా వైరస్ తర్వాత కరోనా కొత్తవేరియంట్ ఒమైక్రాన్ ప్రభావం పెరిగిపోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 31 మందికి వైరస్ నిర్ధారణ అయింది. టాస్క్ఫోర్స్ కమిటీ ఒమైక్రాన్ నియంత్రణపై నిరంతరం సమీక్షలు చేస్తోంది. ఈ మేరకు శనివారం ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ఒమైక్రాన్ తీవ్రత తెలుసుకునేందుకు ప్రభుత్వం సిద్ధం కావాలని స్పష్టం చేసింది. కొత్త పరిశోధనలు కొనసాగాలని వెల్లడించింది. కొత్త వేరియంట్ వైర్సను తట్టుకునే శక్తి ప్రజలలో ఉందా..? ఇప్పటి వరకు ఒమైక్రాన్ సోకిన బాధితులలో యాంటిబాడీలు ఎదుర్కొంటున్నాయా..? రెండు డో సుల వ్యాక్సిన్ అనుకూలం కానుందా..? అనే కోణంలో పరిశోధనలు జరపాల్సిందేనని కమిటీ సిఫారసు చేసింది. సమాజంలో కొత్త వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రస్తుత రోగనిరోధకశక్తి సరిపోతుందా..? అనేది గుర్తించాలని టాస్క్ఫోర్స్ కమిటీ ముఖ్యులు దేవిశెట్టి ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమలులో ఉన్న సీరో సర్వేలో సేకరించి శ్యాంపిల్స్ను మరింత పరిశోధనలు చేయాలన్నారు. ల్యాబ్లు మరిన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇప్పటికే ఒమైక్రాన్ సోకి కోలుకున్నవారి యాంటిబాడీలపై పరిశీలించాలని, వారిపై ఎటువంటి ప్రభావం చూపిందో, వారి వయసు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని కమిటీ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ పొందినవారు ఏ విధంగా వ్యవహరించాలనేది కూడా ప్రజలలో చైతన్యపరచాలన్నారు. వైర్సపై మరిన్ని కోణాలలో పరిశోధనలు జరిపితేగానీ ప్రజలకు ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలనేది సూచించగలమని తేల్చారు. సభలు, సమావేశాలపై ఆంక్షలు విధించాలని తెలిపారు.