తెలంగాణలో 9కి చేరిన ఒమైక్రాన్ కేసులు
ABN , First Publish Date - 2021-12-17T21:09:22+05:30 IST
తెలంగాణలో 9కి ఒమైక్రాన్ కేసులు చేరాయి. గురువారం నమోదైన 4 కేసుల్లో ఒకరి ఆచూకీ లభ్యం కాలేదు. కెన్యా నుంచి వచ్చిన వ్యక్తి
హైదరాబాద్: తెలంగాణలో 9కి ఒమైక్రాన్ కేసులు చేరాయి. గురువారం నమోదైన 4 కేసుల్లో ఒకరి ఆచూకీ లభ్యం కాలేదు. కెన్యా నుంచి వచ్చిన వ్యక్తి(44)గా గుర్తించారు. వ్యక్తి అడ్రస్లో క్లారిటీ లేకపోవడంతో ఆచూకీ దొరకలేదు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో వైద్య సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఒమైక్రాన్ హాట్స్పాట్గా పారమౌంట్ కాలనీ గుర్తించారు. పారమౌంట్ కాలనీని వైద్య సిబ్బంది జల్లడ పడుతోంది. మెడికల్ టూరిజం ద్వారా ఇతన్ని గుర్తించేందుకు అధికారుల ప్రయత్నిస్తున్నారు.
కెన్యా నుంచి వచ్చిన ముగ్గురిలో ఇద్దరు మహిళలు, ఒకరు పురుషుడు. వీరు నాలుగు రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. ర్యాండమ్ టెస్టులో భాగంగా విమానాశ్రయంలో నమూనా తీసుకుని పరీక్షించగా కరోనా పాజిటివ్గా తేలింది. జన్యు విశ్లేషణలో ఒమైక్రాన్ నిర్ధారణ అయింది. ఈ ముగ్గురు నాలుగు రోజుల నుంచి బయట తిరుగుతున్నారు. హైదరాబాద్లో వేర్వేరు హోటళ్లలో బస చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఒమైక్రాన్ పాజిటివ్గా తేలిన తొలి ఇద్దరు వ్యక్తులు (విదేశీయులు) హైదరాబాద్ టోలిచౌకీ, పారామౌంట్ కాలనీ, ఐఏఎస్ కాలనీల్లో తిరిగిన నేపథ్యంలో వీటిని గురువారం జీహెచ్ఎంసీ కట్టడి ప్రాంతాలుగా ప్రకటించింది. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, డాక్టర్లు 25 బృందాలుగా ఏర్పడి పరీక్షలు నిర్వహిస్తున్నారు.