Covid Third wave: ఒమైక్రాన్ బాధితుల్లో యువతరమే అధికం...ఐసీఎంఆర్ సర్వే వెల్లడి
ABN , First Publish Date - 2022-02-04T16:37:20+05:30 IST
కరోనా థర్డ్ వేవ్లో దేశంలోని ఒమైక్రాన్ బాధితుల్లో యువతరమే అధికమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సర్వే వెల్లడించింది...
న్యూఢిల్లీ: కరోనా థర్డ్ వేవ్లో దేశంలోని ఒమైక్రాన్ బాధితుల్లో యువతరమే అధికమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సర్వే వెల్లడించింది. కరోనా రోగులకు తక్కువ ఆరోగ్య సమస్యలు ఉండటంతో మందుల వాడకం కూడా తగ్గిందని ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా 37 ఆసుపత్రుల నుంచి కరోనా రోగుల డేటాను సేకరించినట్లు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు.మూడవ వేవ్ సమయంలో ఆసుపత్రిలో చేరిన వారి సగటు వయస్సు దాదాపు 44సంవత్సరాలని బలరాం చెప్పారు. అంతకుముందు కరోనా రోగుల సగటు వయస్సు 55 ఏళ్లని వైద్యులు చెప్పారు.
2021వ సంవత్సరం డిసెంబర్ 16 నుంచి 2022వ సంవత్సరం జనవరి 17వతేదీ మధ్య ఆసుపత్రిలో చేరిన కరోనా రోగుల డేటాను విశ్లేషించగా యువతీ,యువకులకే అధికంగా ఒమైక్రాన్ సోకిందని తేలింది. ఒమైక్రాన్ రోగుల్లో గొంతు నొప్పి, జ్వరం, దగ్గు సమస్యలు ఎక్కువగా కనిపించాయని డాక్టర్లు చెప్పారు. థర్డ్ వేవ్ ఒమైక్రాన్ పాజిటివ్ రోగులకు కరోనా లక్షణాలు తక్కువగానే ఉన్నాయని ఐసీఎంఆర్ సర్వేలో తేలిందని వైద్యులు వివరించారు.