ఆ 13 మందికి ఒమైక్రాన్‌ నెగెటివ్‌

ABN , First Publish Date - 2021-12-07T08:20:49+05:30 IST

ఇటీవల విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి.. కరోనా పాజిటివ్‌గా తేలిన 13 మంది నమూనాల్లో ఒమై క్రాన్‌ వేరియంట్‌ లేదని స్పష్టమైంది. హైదరాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న

ఆ 13 మందికి ఒమైక్రాన్‌ నెగెటివ్‌

  • విదేశాల నుంచి హైదరాబాద్‌ వచ్చిన వీరికి కరోనా..
  • జన్యు విశ్లేషణలో కొత్త వేరియంట్‌ లేదని స్పష్టం
  • వ్యాక్సినేషన్‌ వేగం పెంచండి: మంత్రిహరీశ్‌
  • కరీంనగర్‌ వైద్య కాలేజీలో మరో 7 కేసులు


హైదరాబాద్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఇటీవల విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి.. కరోనా పాజిటివ్‌గా తేలిన 13 మంది నమూనాల్లో ఒమై క్రాన్‌ వేరియంట్‌ లేదని స్పష్టమైంది. హైదరాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న వీరందరికీ కొవిడ్‌ నిర్ధారణ కావడంతో గచ్చిబౌలి టిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. అనంతరం నమూనాలను జన్యు విశ్లేషణకు పంపగా.. ఒమైక్రాన్‌ నెగెటివ్‌ అని తేలిందని ప్రభుత్వం ప్రకటించింది.  కాగా, ముప్పు జాబితాలోని దేశాల నుంచి హైదరాబాద్‌కు 1,805 మంది వచ్చారు. తొలుత యూకే నుంచి నగరానికి చేరుకున్న మహిళకు కొవిడ్‌ సోకినట్లు తేలింది. తర్వాత మరో 12 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఒకరిద్దరి నమూనాల్లో ఒమైక్రాన్‌ ఉంటుందన్న అనుమానా లు వ్యక్తమయ్యాయి.


అయితే, ఎవరికీ వేరియంట్‌ లేదని స్పష్టమవడంతో వైద్య ఆరోగ్య శాఖ ఊపిరి పీల్చుకుంది. ఈ విషయాన్ని ఉన్నతాధికా రులు ఆరోగ్య మంత్రి హరీశ్‌రావుకు నివేదించారు. ఈ సందర్భంగా టీకా పంపిణీని మరింత వేగిరం చేయాలని మంత్రి వారికి సూచించారు. రెండో డోసు పంపిణీపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. కొత్త వేరియంట్‌ను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.


కొత్తగా 535 రాక.. అందరికీ కొవిడ్‌ నెగెటివ్‌

సోమవారం వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి 535 మంది వచ్చారు. వీరందరికీ పరీక్షలు చేయగా ఎవరికీ కరోనా పాజిటివ్‌ రాలేదని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 4 వేలకు చేరింది. వైర్‌సతో గతేడాది మార్చిలో తొలి మరణం సంభవించింది. అప్పటినుంచి నమోదవుతూనే ఉన్నాయి. కాగా, సోమవారం 37,108 మందికి పరీక్షలు చేయగా 195 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఒకరు చనిపోయారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇంకా 3,810 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 78, కరీంనగర్‌, మేడ్చల్‌ జిల్లాల్లో 14 చొప్పున, రంగారెడ్డి జిల్లాలో 13 నమోదయ్యాయి. సోమవారం రికార్డు స్థాయిలో 4,30,782 మందికి టీకా పంపిణీ చేశారు. ఇందులో 2,36,383 మందికి తొలి, 1,94,399 మందికి రెండో డోసు ఇచ్చారు.

కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలలో సోమవారం మరో ఏడుగురికి కరోనా నిర్ధారణ అయింది. శని, ఆదివారాల్లో 43 మందికి వైరస్‌ బారినపడినట్లు తేలగా.. తాజా కేసులతో మొత్తం సంఖ్య 50కి చేరింది. కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, సీపీ సత్యనారాయణ, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జువైరియా వైద్య కళాశాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం అనంతోగు కస్తూర్బా పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని వైద్యాధికారులు నిర్ధారించడం లేదు. కాగా, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మామిడిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. కొందరిలో లక్షణాలు కనిపించడంతో.. 28 మందికి పరీక్షలు చేయించారు. మిగతావారికి మంగళవారం టెస్టులు చేయనున్నారు.


ఎమ్మెల్యే సారూ.. మాస్కేది?

భైంసా, డిసెంబరు 6 : దేశంలో ఒమైక్రాన్‌ వ్యాప్తి ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం.. వైరస్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే బయటకు వెళ్లే వారు విఽధిగా మాస్కులు ధరించాలని.. లేనిపక్షంలో రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ప్రకటించింది. అయితే సాక్షాత్తూ ఎమ్మెల్యేనే సర్కారు నిర్ణయానికి తూట్లు పొడుస్తున్నారు. నిర్మల్‌ జిల్లా ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, స్థానిక సంస్థల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి విఠల్‌ సోమవారం భైంసాలో ఎన్నికల ప్రచార సమావేశాలను నిర్వహించారు. డివిజన్‌ పరిధిలోని ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఎవరూ  మాస్కులు ధరించకపోవడం గమనార్హం. 

Updated Date - 2021-12-07T08:20:49+05:30 IST