ఒమైక్రాన్‌.. టెన్షన

ABN , First Publish Date - 2021-12-02T04:43:37+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మూడో విడత కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ రూపంలో విస్తరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ధ్రువీకరించింది. ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ బారిన పడకుండా ఉండొచ్చునన్న ఉద్దేశంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.

ఒమైక్రాన్‌.. టెన్షన

వైరస్‌ విస్తరిస్తున్నట్లు ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

ముందు జాగ్రత్తలు అవసరమంటున్న వైద్యులు

గజపతినగరం, డిసెంబరు 1: ప్రపంచవ్యాప్తంగా కరోనా మూడో విడత కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ రూపంలో విస్తరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ధ్రువీకరించింది. ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ బారిన పడకుండా ఉండొచ్చునన్న ఉద్దేశంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇటు జిల్లా యంత్రాంగం కూడా కొవిడ్‌ నియంత్రణపై దృష్టి సారించారు. ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల గురించి ఆరా తీస్తున్నారు. వైద్యులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మాస్కులు ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని.. చేతులను శుభ్రం చేసుకోవాలని..  రెండు  డోస్‌ల వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కొవిడ్‌ టీకా మొదటి డోస్‌ 70 శాతం మందికి వేయగా.. రెండో డోస్‌ 60శాతం మందికి వేశారు. మిగతా వారికి త్వరగా వ్యాక్సినేషన పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నేటికీ కొందరు వ్యాక్సినకు భయపడుతూ వెనక్కు తగ్గుతున్నారు. ఏం జరుగుతుందోనని ముందుకు రావడం లేదు. అటువంటి వారిని గుర్తించే పనిలో వైద్య సిబ్బంది నిమగ్నమయ్యారు. ఒమైక్రాన్‌ మన వరకు వచ్చినా నష్టం జరగకుండా ఉండాలంటే అందరూ వ్యాక్సిన తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రజల ముందు జాగ్రత్త చర్యలే వారి ప్రాణాలకు రక్షణ అని... దీన్ని గుర్తించి నడుచుకోవాలని వైద్యులు కోరుతున్నారు. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ వేస్తున్నారు. డిసెంబర్‌లో మూడో వేవ్‌ రావొచ్చనన్న హెచ్చరికల నేపథ్యంలో ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సన్నద్ధం అవుతున్నారు. గతంలో కొవిడ్‌ చికిత్స కోసం వినియోగించిన ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, ఆక్సిజన్‌ సరఫరాతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో వసతులపై ఆరా తీస్తున్నారు. 

జాగ్రత్తలను వదిలేశారు..

కరోనా ఉధృతి సమయంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించారు. అన్ని జాగ్రత్తలు తీసుకొనేవారు. భౌతిక దూరం పాటించేవారు. గత కొంతకాలంగా వాటన్నింటినీ విస్మరించారు. ఏవీ పాటించడం లేదు. జాగ్రత్తలను పూర్తిగా మరిచిపోయారు. కరోనా ఇంకా పోలేదని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. ఇలాగే కొనసాగితే ఒమైక్రాస్‌ విజృంభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా బయట తిరిగే వారిలో నిర్లక్ష్య ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. మాస్కుల వినియోగం కూడా అంతంతమాత్రమే. గ్రామీణ ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్న ఆనవాళ్లే లేకుండా పోయాయి. దుకాణాల వద్ద ఎలాంటి నిబంధనలు కనిపించడం లేదు. 

అప్రమత్తతే  ఆయుధం

లక్షణాలు కనిపించకుండానే ఒమైక్రాన వైరస్‌ వ్యాపిస్తుండడం ఇతర దేశాల్లో చూస్తున్నాం. ఇది ఆందోళన కలిగించే విషయమే. అందుకే ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలి. లేకుంటే కొత్త వైరస్‌ బారిన పడాల్సి వస్తుంది. అప్రమత్తంగా ఉండాల్సిందే. 

-ఎ.అజయ్‌కుమార్‌, ప్రభుత్వ వైద్యాధికారి



Updated Date - 2021-12-02T04:43:37+05:30 IST