ఆహ్లాదం అంచున.. పొంచి ఉన్న ప్రమాదం

ABN , First Publish Date - 2021-10-18T03:46:03+05:30 IST

నాగర్‌కర్నూల్‌-నల్లగొండ జిల్లాల సరిహద్దులో ఉన్న డిండి ప్రాజెక్టు ప్రమాదానికి నిలయంగా మారింది. పర్యాటకులు సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు స్పిల్‌ వేపైకి వెళ్లి, జారి నీళ్లలో పడి ప్రాణాలు కోల్పోతున్నారు.

ఆహ్లాదం అంచున.. పొంచి ఉన్న ప్రమాదం
పరవళ్లు తొక్కుతున్న డిండి ప్రాజెక్టును చూసేందుకు రోడ్డు పక్కన వాహనాలు ఆపిన పర్యాటకులు

ప్రమాదకరంగా మారిన డిండి ప్రాజెక్టు స్పిల్‌వే

దానిపైకి వెళ్లి సెల్ఫీలు తీసుకుంటూ జారిపడి చనిపోతున్న పర్యాటకులు

40 రోజులుగా జాలువారుతున్న నీళ్లు

పెరిగిన పర్యాటకుల తాకిడి 8 భద్రత, రక్షణ చర్యలు కరువు

తాజాగా ప్రాజెక్టులో పడి ఇద్దరు మృతి


అచ్చంపేట/ఉప్పునుంతల, అక్టోబరు 17: నాగర్‌కర్నూల్‌-నల్లగొండ జిల్లాల సరిహద్దులో ఉన్న డిండి ప్రాజెక్టు ప్రమాదానికి నిలయంగా మారింది. పర్యాటకులు సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు స్పిల్‌ వేపైకి వెళ్లి, జారి నీళ్లలో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఆదివారం హైదరాబాద్‌లోని బంజరాహిల్స్‌కు చెందిన సాగర్‌(21), జహీరాబాద్‌కు చెందిన ప్రవీణ్‌(23) స్పిల్‌వే పైకి వచ్చి సెల్ఫీ తీసుకుంటుండగా, కాళ్లు జారి నీటిలో పడి మృతి చెందారు. దసరా నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉంటున్న ఆరుగురు స్నేహితులు వంగరి విశాల్‌, బచ్చినేని బలరాం, పకాలి వంశీ, కటిక అనిల్‌కుమార్‌, మహ్మద్‌ సాగర్‌, ప్రవీణ్‌కుమార్‌ మూడు ద్విచక్ర వాహనాలపై ఈ నెల 15న శ్రీశైలం దైవదర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆదివారం డిండి ప్రాజెక్టు వద్ద ఆగగా, ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 


భద్రతా చర్యలు ఏవీ?

ప్రాజెక్టు వద్ద భద్రత, రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాజెక్టు సామర్థ్యం రెండు టీఎంసీలు. గత 40 రోజులుగా దుందుభీ నదికి వరద అంతకంతకూ పెరుగుతోంది. 32 ఫీట్ల వరకు నీళ్లు చేరాయి. శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రవాహదారి పక్కనే ప్రాజెక్టు ఉండటంతో చూసేందుకు పర్యాటకులు బారులు తీరుతారు. శ్రీశైలం-హైదరాబాద్‌ రవాహదారి గుండా శ్రీశైలంతో పాటు మద్దిమడుగు, మల్లెలతీరం ఉమామహేశ్వరం తదితర పుణ్యక్షేత్రాలు ఉండటంతో అటుగా వెళ్లే వారు కూడా ప్రాజెక్టు అందాలను చూసేందుకు ఆగుతున్నారు. 30 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 40 రోజులుగా ప్రాజెక్టు జాలువారుతుండటంతో పర్యాటకులు సెల్‌ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. సెల్ఫీలు దిగుతున్నారు. ఈ క్రమంలో స్పిల్‌వేపైకి వెళ్లి సెల్ఫీలు దిగుతూ, జారి కిందపడి చనిపోతున్నారు. ఇక్కడ రక్షణ చర్యలు, భదత్రా ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రాజెక్టు నల్లగొండ జిల్లాలోని డిండి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని ఉప్పునుంతల మండల పరిధిలో ఉంటుంది ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతున్న సమయంలో రెండు మండలాల పోలీసులు గతంలో భద్రతా చర్యలు చేపట్టే వారు. ఈ ఏడాది సెప్టెంబరు ఏడో తేదీ నుంచి ప్రాజెక్టు పరవళ్లు తొక్కగా, రెండు మండలాల పోలీసులు రెండు రోజులు హడావుడి చేసి, తర్వాత మరిచిపోయారు. ప్రాజెక్టు వద్ద ఇకనైనా రక్షణ, భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-10-18T03:46:03+05:30 IST