ఈ ప్రభుత్వ టీచర్ నెల జీతం రూ.26500.. కానీ బ్యాంకు లాకర్లలో ఏకంగా కోటి రూపాయలు.. ఎక్కడివని అధికారులు అడిగితే..
ABN , First Publish Date - 2021-11-26T22:31:45+05:30 IST
అతని పేరు నీరజ్ కుమార్.. 2013లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియమితుడయ్యాడు.
అతని పేరు నీరజ్ కుమార్.. 2013లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియమితుడయ్యాడు.. అతని నెల జీతం రూ.26500.. బుధవారం ఉదయం ఇన్కమ్టాక్స్ అధికారులు అతడి బ్యాంక్ లాకర్లపై దాడి చేశారు.. కోటి రూపాయల నగదు, రెండు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.. అంత డబ్బు ఎక్కడిదని ఆరా తీశారు.. అతడు చెప్పిన సమాధానం విని నివ్వెరపోయారు.. నెల రోజుల్లో తగిన ఆధారాలు సమర్పించాలని ఆదేశించారు.. బీహార్లోని పాట్నాలో ఈ ఘటన జరిగింది.
పాట్నాకు సమీపంలోని సాకేత్పురి గ్రామానికి చెందిన నీరజ్ కుమార్ స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. 2013లో కొలువులో చేరిన నీరజ్కు నెలకు రూ.26500 జీతం వస్తుంటుంది. బుధవారం ఉదయం అతడి బ్యాంక్ లాకర్లపై ఇన్కమ్టాక్స్ అధికారులు దాడి చేశారు. కోటి రూపాయల నగదు, రెండు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంత డబ్బు ఎక్కడిదని ఆరా తీశారు. తాను నవరచన కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లలో ఒకడినని నీరజ్ చెప్పాడు.
2013లో ప్రభుత్వోద్యోగం రావడంతో ఆ సంస్థలో అన్ పెయిడ్ డైరెక్టర్గా కొనసాగుతున్నానని, తన వాటా డబ్బును బ్యాంక్ లాకర్లలో ఉంచానని అధికారులకు చెప్పాడు. కాగా, దానికి సంబంధించిన ఆధారాలను నెల రోజుల్లో సమర్పించాలని అధికారులు ఆదేశించారు. కాగా, తమతో పాటు తిరుగుతున్న నీరజ్ ఓ మిలియనీర్ అని తెలిసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.