Maoist blast: మందుపాతర పేల్చివేత: ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-08-05T17:04:23+05:30 IST
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో కూలీలు ప్రయాణిస్తున్న జీపును మందుపాతరతో పేల్చివేశారు....
11 మందికి గాయాలు
దంతెవాడ (ఛత్తీస్గఢ్): ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో కూలీలు ప్రయాణిస్తున్న జీపును మందుపాతరతో పేల్చివేశారు. ఈ ఘటనలో ఓ కూలీ మరణించగా, మరో 11మంది గాయపడ్డారని దంతెవాడ పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ పల్లవ చెప్పారు.వాహనంలో ప్రయాణిస్తున్న వారు ఎక్కువగా కూలీలు అని పోలీసులు తెలిపారు. వారిలో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ధన్ సింగ్ కూలీ చికిత్స పొందుతూ మరణించాడు. పేలుడు ప్రదేశం వద్ద వైర్లను పోలీసులు గుర్తించారు.మావోయిస్టులు జీపును పోలీసు వాహనంగా భావించి దానిని లక్ష్యంగా చేసుకుని పేల్చి ఉండవచ్చునని ఎస్పీ చెప్పారు.కూలీలు బాలాఘాట్ నుంచి తెలంగాణకు వెళుతుండగా ఈ మందుపాతరను మావోయిస్టులు పేల్చారు.