ఒకరి నిర్లక్ష్యానికి... మరొకరి ప్రాణం బలి

ABN , First Publish Date - 2021-01-16T11:50:58+05:30 IST

ఒకరి నిర్లక్ష్యం వల్ల మరొకరి ప్రాణం పోయిన ఘటన సైఫాబాద్..

ఒకరి నిర్లక్ష్యానికి... మరొకరి ప్రాణం బలి

హైదరాబాద్/ఖైరతాబాద్‌ : ఒకరి నిర్లక్ష్యం వల్ల మరొకరి ప్రాణం పోయిన ఘటన సైఫాబాద్‌ పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తోడేటి శ్రీనివాస్‌, మంగ భార్యాభర్తలు. మంగ ఇంట్లో వంటలు చేస్తుండగా శ్రీనివాస్‌ లకిడీకాపూల్‌ రాజ్‌దూత్‌ హోటల్‌ చౌరస్తాలో భోజనం శాల నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో కూరలు అయిపోవడంతో శ్రీనివాస్‌ భార్యకు ఫోన్‌ చేసి కూరలు వండమని చెప్పాడు. ఆమె వండి ఫోన్‌ చేయగా.. వాటిని తీసుకువచ్చేందుకు ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నాడు.


మార్గమధ్యంలో రోడ్డుపై ఆగివున్న కారు డోర్‌ను ఓ మహిళ అకస్మాత్తుగా తీయడంతో శ్రీనివాస్‌ దాన్ని ఢీకొని రోడ్డుపై పడడంతో తీవ్రమైన గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని మూడు ఆస్పత్రులకు తరలించినా ప్రయోజనం లేదు. అర్ధరాత్రి తర్వాత మృతి చెందాడు. ప్రమాదానికి కారకుడైన ఎంజే ముజీబ్‌, అతడి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కారును స్వాధీనం చేసుకున్నారు. ముజీబ్‌ భార్యపై కేసు నమోదు చేశారు. శ్రీనివాస్‌ మృతితో ఖైరతాబాద్‌లో విషాదం నెలకొంది.

Updated Date - 2021-01-16T11:50:58+05:30 IST