బైక్‌ను కారు ఢీకొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-03-02T06:03:16+05:30 IST

హైదరాబాద్‌-మెదక్‌ జాతీయ రహదారిపై బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.

బైక్‌ను కారు ఢీకొని ఒకరి మృతి
ప్రమాదంలో మృతి చెందిన నరేష్‌, ఆంబులెన్సులో క్షతగాత్రులను తరలిస్తున్న దృశ్యం

నల్గురు పిల్లలకు తీవ్ర గాయాలు- జాతరకు వెళ్తుండగా ఘటన

నర్సాపూర్‌, మార్చి 1 : హైదరాబాద్‌-మెదక్‌ జాతీయ రహదారిపై బైక్‌ను కారు  ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నర్సాపూర్‌ సమీపంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది.. ఎస్‌ఐ గంగరాజు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని దాచారం గ్రామానికి సంగరి నరేష్‌(26) అనే వ్యక్తి లక్ష్మీనర్సింహ, బచ్చేందర్‌, అఖిల్‌, చిట్టిబాబు నలుగురు బంధువుల పిల్లలతో కలిసి శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో జాతర ఉత్సవాలకు హైదరాబాద్‌-మెదక్‌ జాతీయ రహదారి మీదుగా బయలుదేరాడు. ఈ క్రమంలో నర్సాపూర్‌ పట్టణ సమీపంలోకి చేరుకోగానే సబ్‌స్టేషన్‌ వద్ద ఎదురుగా వస్తున్న కారు అతివేగంగా వచ్చి అదుపుతప్పి బైక్‌ను ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నరేష్‌ అక్కడికక్కడే మృతి చెందగా బైక్‌పై ఉన్న నలుగురు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి.  విషయం తెలుసుకున్న ఎస్‌ఐ గంగరాజు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్సులో ఆసుపత్రికి  తరలించారు. కారు టైర్‌ పగిలి సంఘటనా స్థలంలో నిలిచిపోయింది. ఎస్‌ఐ కేసు  దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

Updated Date - 2021-03-02T06:03:16+05:30 IST