అత్యధిక సంతానం కలిగిన తల్లిదండ్రులకు రూ. లక్ష బహుమతి

ABN , First Publish Date - 2021-06-22T15:19:38+05:30 IST

దేశంలో పలు రాష్ట్రాలు జనాభా నియంత్రణ విధానాన్ని సమర్ధిస్తున్న తరుణంలో మిజోరంలో అత్యధిక సంఖ్యలో పిల్లలున్న దంపతులకు బహుమతి...

అత్యధిక సంతానం కలిగిన తల్లిదండ్రులకు రూ. లక్ష బహుమతి

మిజోరాం మంత్రి వెల్లడి

ఐజ్వాల్ (మిజోరం): దేశంలో పలు రాష్ట్రాలు జనాభా నియంత్రణ విధానాన్ని సమర్ధిస్తున్న తరుణంలో మిజోరంలో అత్యధిక సంఖ్యలో పిల్లలున్న దంపతులకు బహుమతి ఇస్తామని మిజోరం రాష్ట్రమంత్రి సంచలన ప్రకటన చేశారు. అధిక సంఖ్యలో పిల్లలున్న వారికి తాము లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తామని మిజోరం రాష్ట్ర మంత్రి రాబర్ట్ రోమావియా రాయ్టే ప్రకటించారు.మిజో వర్గాల్లో జనాభా పెరుగుదలను ప్రోత్సహించడానికి తన నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో పిల్లలతో నివశిస్తున్న తల్లిదండ్రులకు లక్షరూపాయల నగదు ప్రోత్సాహకాన్ని మంత్రి రాబర్ట్ ప్రకటించారు.


ఐజాల్ ఈస్ట్ -2 అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో సంతానం ఉన్న సజీవ పురుషుడు, లేదా స్త్రీకి లక్షరూపాయల నగదు బహుమతిని ఇస్తామని మంత్రి చెప్పారు.దీంతో పాటు సర్టిఫికెట్, ట్రోఫీని కూడా ఇస్తామని మంత్రి వివరించారు. ఈ ప్రోత్సాహక బహుమతి ఖర్చును మంత్రి కుమారుడి యాజమాన్యంలోని నిర్మాణ కన్సల్టెన్సీ సంస్థ భరించనుంది. మిజో జనాభా తగ్గుతుండటం తనను తీవ్ర ఆందోళన కలిగిస్తోందని మంత్రి చెప్పారు.2011 జనాభా లెక్కల ప్రకారం మిజోరం జనాభా 10,91,014 మంది అని అతితక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతంగా పేరొందింది. కాగా 2021 జనవరి నుంచి ఇద్దరు పిల్లలకు పైగా ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కాదని అసోం ప్రకటించింది.

Updated Date - 2021-06-22T15:19:38+05:30 IST