హైదరాబాద్లో 1.19 లక్షల వాహనాలు సీజ్
ABN , First Publish Date - 2021-06-24T18:31:44+05:30 IST
మే 12 నుంచి జూన్ 18 వరకు 38 రోజుల్లో హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధుల్లో ...
- కర్ఫ్యూ, లాక్డౌన్ సమయంలో
- రూ. వెయ్యి జరిమానాతో తిరిగి అప్పగింత
హైదరాబాద్ సిటీ : కరోనా సెకండ్ వేవ్ నియంత్రణకు ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ, లాక్డౌన్ సమయంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మే 12 నుంచి జూన్ 18 వరకు 38 రోజుల్లో హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధుల్లో 1.19 లక్షల వాహనాలను సీజ్ చేశారు. ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో అకారణంగా రోడ్లపైకి వచ్చిన వారి వాహనాల్ని సీజ్ చేసి జరిమానా విధించారు.
75 శాతం వాహనాలు అప్పగింత
సీజ్ చేసిన వాహనాలకు సంబంధించి ఆన్లైన్లో జరిమానా చెల్లించి పోలీస్స్టేషన్లో రశీదు చూపించి వాహనం తిరిగి తీసుకెళ్లాలని పోలీసులు సూచించారు. చాలా వాహనాలను వ్యవధిలోనే తిరిగి ఇచ్చేసినట్లు అధికారులు తెలిపారు. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాతే వాహనాలు తిరిగి ఇస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ, పార్కింగ్ అసౌకర్యం, వాహనాలకు రక్షణ కల్పించలేక పోవడం లాంటి సమస్యలతో అదే రోజు లేదా మరుసటి రోజు 75 శాతం వాహనాలను పోలీసులు యజమానులకు తిరిగి ఇచ్చేశారు. మిగతా వాటిని కూడా రూ. 1000 జరిమానాలు చెల్లించి క్రమంగా తీసుకెళ్లి పోతున్నారు. కేవలం లాక్డౌన్ ఉల్లంఘనలు మాత్రమే కాకుండా, లైసెన్సు, వాహన పత్రాలు, మైనర్ డ్రైవింగ్ లాంటి అంశాల్లో కూడా వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
కమిషనరేట్ల వారీగా సీజ్ అయిన వాహనాలు
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో- 72,506
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో- 24,000
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో- 22092
మొత్తం వాహనాలు :- 1,18,598