ఒన్‌ మ్యాన్‌ ఆర్మీ

ABN , First Publish Date - 2021-04-10T05:43:28+05:30 IST

తెల్లవారుజామున నాలుగింటికే ఆయన నిద్ర లేస్తున్నారు. అయిదింటికంతా కారెక్కుతారు. మందీ మార్బలం ఉండదు.

ఒన్‌ మ్యాన్‌ ఆర్మీ

తెల్లవారుజామున నాలుగింటికే ఆయన నిద్ర లేస్తున్నారు. అయిదింటికంతా కారెక్కుతారు. మందీ మార్బలం ఉండదు. కార్లు బారులుతీరవు. ఒకరిద్దరు అనుచరులు మాత్రమే వెంట ఉంటారు. రోడ్‌ షోలు చేయరు. సభలు పెట్టరు. గడప గడపా తొక్కుతారు. మనిషి మనిషినీ పలకరిస్తారు. కరపత్రం ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీకే ఓటేయమని అడుగుతారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ అభ్యర్ధుల ప్రచార హంగామాకు దూరంగా  తన ప్రచారం తనే చేసుకుంటున్నారు డాక్టర్‌ చింతామోహన్‌. కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఆయన పేరు అధికారికంగా ప్రకటించడానికి నెల ముందు నుంచే  పల్లెలు చుట్టడం మొదలు పెట్టేశారు. ఎర్రటి ఎండలో చెమటలు కారుతున్నా ఆయన ఒంటరి ప్రచారం కొనసాగుతూనే ఉంది. పట్టణాల్లో కన్నా పల్లెల్లోనే ఆయన ఎక్కువగా కనిపిస్తున్నారు. అందునా దళితవాడల్లో ఎక్కువగా తిరుగుతున్నారు. ఓటడిగి ఊరుకోకుండా ప్రభుత్వ పథకాల గురించీ, పెరుగుతున్న ధరల గురించీ వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. చింతామోహన్‌ ఓటు అడుగుతూ పంచుతున్న కరపత్రంలో రాహుల్‌, ప్రియాంకలతో పాటూ ఇందిరాగాంధీ ఫొటో ఉండడం విశేషం. కాంగ్రెస్‌ పార్టీ మరిచిపోయిన ఇందిరాగాంధీని ఆయన ప్రజలకు గుర్తుచేస్తున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసి,  6 సార్లు ఎంపీగా గెలిచిన చింతామోహన్‌ పదోసారి ఎన్నికల బరిలో దిగి 66 ఏళ్ల వయసులో సాగిస్తున్న ప్రచారశైలి మొత్తానికి విభిన్నంగా ఉంటోంది.

- తిరుపతి, ఆంధ్రజ్యోతి

Updated Date - 2021-04-10T05:43:28+05:30 IST