కరోనా బారిన రోజుకు వెయ్యిమంది రైల్వే ఉద్యోగులు
ABN , First Publish Date - 2021-05-11T17:06:08+05:30 IST
భారతీయ రైల్వేలో 13 లక్షలకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలో 13 లక్షలకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి రోజు వెయ్యి మందికిపైగా రైల్వే సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటివరకూ కరోనా కారణంగా 1952 మంది రైల్వే ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ మాట్లాడుతూ తాము ప్రతీరోజు ప్రయాణికులను, వస్తువులను రైళ్లలో తరలిస్తుంటామని, ఈ నేపధ్యంలో రైల్వేశాఖలో పనిచేస్తున్న సిబ్బంది కరోనా బారిన పడుతున్నారన్నారు. అయితే తమ విభాగంలో పనిచేస్తూ కరోనా బారిన పడినవారికి రైల్వే ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. రైల్వే ఆసుపత్రులలో ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇదిలావుండగా కరోనాతో ప్రాణాలు కోల్పోయిన రైల్వే సిబ్బందికి ఫ్రంట్లైన్ వారియర్స్ తరహాలో రూ.50 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని కోరుతూ 'ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ ఇటీవల రైల్వే మంత్రి పియూష్ గోయల్కు లేఖ రాసింది.