భార్య మృతి కేసులో ఏడాది జైలు

ABN , First Publish Date - 2021-07-27T06:08:01+05:30 IST

భార్య మృతికి కారణమైన భర్తకు సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ సూర్యాపేట రెండో జిల్లా అదనపు జడ్జి కె. కళ్యాణచక్రవర్తి సోమవారం తీర్పు చెప్పారు.

భార్య మృతి కేసులో ఏడాది జైలు

సూర్యాపేట లీగల్‌, జూలై 26: భార్య మృతికి కారణమైన భర్తకు సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ సూర్యాపేట రెండో జిల్లా అదనపు జడ్జి కె. కళ్యాణచక్రవర్తి సోమవారం తీర్పు చెప్పారు. వరంగల్‌ జిల్లా సుందనపల్లి గ్రామానికి చెందిన తాటిపాముల బిక్షపతి కూతురు మౌనిక, సూర్యాపేట జిల్లా నూతన్‌కల్‌ మండలంలోని పెదనేమిల గ్రామానికి చెందిన కాసోజు మధనాచారి 2013 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంత కాలం తర్వాత వారి మధ్య మనస్పర్థలు ప్రారంభమయ్యాయి. 2016 జనవరి 22వ తేదీన భార్య భర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మౌనిక తలకు బలమైన గాయాలు కావడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ 2016 ఫిబ్రవరి 24వ తేదీన మృతిచెందింది. మౌనిక తండ్రి తాటిపాముల బిక్షపతి నూతన్‌కల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్‌ఐ అభిలాష్‌, తుంగతుర్తి సీఐ లక్ష్మణ్‌ నిందితుడిపై అభియోగపత్రం దాఖలు చేశారు. 16మంది సాక్షులను విచారించిన కోర్టు నిందితుడిపై నేర నిరూపణకావడంతో జడ్జి పైవిధంగా తీర్పు ఇచ్చారు.

Updated Date - 2021-07-27T06:08:01+05:30 IST