72 అడుగుల ఆంజనేయ విగ్రహ నిర్మాణానికి భూమిపూజ
ABN , First Publish Date - 2020-10-27T07:03:26+05:30 IST
పర్చూరులోని వైజంక్షన్లో నూతనంగా నిర్మించనున్న అభయాంజనేయస్వామి విగ్రహ నిర్మాణ భూమిపూజా కార్యక్రమం సోమవారం వైభవంగా జరిగింది.
పాల్గొన్న డీసీఎంఎస్ చైర్మన్ రావి దంపతులు, బత్తుల
కిక్కిరిసిన పర్చూరు బొమ్మల సెంటర్
పర్చూరు, అక్టోబరు 26 : పర్చూరులోని వైజంక్షన్లో నూతనంగా నిర్మించనున్న అభయాంజనేయస్వామి విగ్రహ నిర్మాణ భూమిపూజా కార్యక్రమం సోమవారం వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు 108 కలశాలతో, మేళతాళాలతో స్థానిక అద్దంకి నాంచారమ్మ, వేణుగోపాలస్వామి ఆలయాల నుంచి ఊరేగింపుగా తరలి వెళ్లారు. భూమిపూజా కార్యక్రమానికి డీసీఎంఎస్ చైర్మన్, నియోజకవర్గ ఇన్చార్జి రావి రామనాథంబాబు, పద్మ దంపతులతోపాటు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. విగ్రహ నిర్మాణ ప్రాంగణంలో వేదపండితుల సారథ్యంలో పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం నవదాన్యాలతో భూమిపూజా కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కోటా హరిప్రసాద్, కోటా శ్రీనివాసరావు, యద్దనపూడి హరిప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారుల కోలాట భజన కార్యక్రమాలు అలరించాయి. అభయ అంజనేయస్వామి 72 అడుగుల విగ్రహానికి సంబంధించిన భూమిపూజా కార్యక్రమానికి పర్చూరు గ్రామంతోపాటు, చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రావటంతో బొమ్మల సెంటర్ ప్రాంగణం కిక్కిరిసింది. జిల్లాలోనే అతిపెద్ద విగ్రహాన్ని పర్చూరులో ఏర్పాటు చేయనున్నారు.