చిత్తూరు కలెక్టరేట్: ఉల్లి ధర తగ్గింది. మూడు నెలలుగా ఏ గ్రేడు 50 కిలోల బస్తా ధర రూ.1800 నుంచి రూ.2 వేలు పలికింది. ఇప్పుడు రూ.700 మాత్రమే. బి.గ్రేడ్ రకం రూ.500 నుంచి రూ.550 ఉంది. కిలో ఉల్లిపాయల ధర రూ.40- రూ.35 పలకగా.. ఇప్పుడు రవాణా చార్జీలు కలుపుకొని రిటైల్లో రూ.15 నుంచి రూ.20 ఉంది. హోల్సేల్ ధర, రీటైల్ ధర మధ్య రూ.2 మాత్రమే వ్యత్యాసం ఉంది. చిత్తూరు మార్కెట్కు రోజుకు 10, 20 మధ్య లారీల ఉల్లి దిగుమతి అవుతోంది. ఈ ఏడాది వర్షాలు అవసరమైన మేర కురవడం, వాతావరణ అనుకూలత కలిసొచ్చి మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉల్లి దిగుబడి పెరగడంతో ధరలపై ఈ ప్రభావం పడింది. కాగా, కర్నూలు ఉల్లి మరో నెల రోజుల్లో కోతకు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఉల్లి ధరలు మరింత తగ్గే అవకాశముందని భావిస్తున్నారు.