మార్కెట్లో ఇక చౌకగా onions...ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు
ABN , First Publish Date - 2021-11-04T16:31:09+05:30 IST
గత ఏడాది కంటే మార్కెట్లో ఉల్లిపాయలు చౌక ధరలకు లభించనున్నాయి...
గోదాముల్లో 2,00,000 టన్నుల ఉల్లిపాయల నిల్వ
న్యూఢిల్లీ : గత ఏడాది కంటే మార్కెట్లో ఉల్లిపాయలు చౌక ధరలకు లభించనున్నాయి. దేశంలో ఉల్లి ధరలను నియంత్రించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నెలలో గోదాముల్లో రికార్డు స్థాయిలో 2,00,000 టన్నుల ఉల్లిపాయలను నిల్వ చేసింది. దేశవ్యాప్తంగా ఇటీవల వర్షాల కారణంగా ఉల్లిపాయల రవాణాకు అంతరాయం వాటిల్లడంతో మార్కెటులో వీటి ధర కిలోకు రూ.40కు పెరిగింది. దీంతో ఉల్లి ధరలను తగ్గించడానికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ నిల్వ చేసిన ఉల్లిపాయల బఫర్ నుంచి విడుదల చేసింది.
ఢిల్లీ, కోల్కతా, లక్నో, పాట్నా, రాంచీ, గౌహతి, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, చండీగఢ్ వంటి ప్రధాన మార్కెట్లలో మొత్తం 1,11,376.17 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను కేంద్రం విడుదల చేసింది. రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉల్లిపాయలను దాని బఫర్ స్టాక్ నుంచి కిలో 21 రూపాయల రేటుకు విక్రయించడానికి ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో మార్కెట్ లో పెరిగిన ఉల్లి ధరలు దిగి వచ్చాయి. 2020 అక్టోబర్లో కూడా ఉల్లిపాయల ధరలు రెట్టింపు అయ్యాయి.
అదే సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లో అకాల వర్షపాతం కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. రిటైల్ ధరలు మొదటగా ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో కిలో ఉల్లిపాయల ధర రూ.35 నుంచి రూ.70కి పెరిగింది. ఆపై కిలో ధర వందరూపాయలకు చేరింది.