యాప్ ఫెయిల్.. గురువుల గగ్గోలు
ABN , First Publish Date - 2022-08-18T21:43:09+05:30 IST
టీచర్ల ఆన్లైన్ హాజరు(Online attendance of teachers) నమోదులో జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులు బుధవారం వరుసగా రెండో రోజు కూడా గందరగోళ పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఫ్యాప్టో పిలుపు మేరకు ఆన్లైన్ హాజరు నమోదుకు నిరాకరించారు.
రెండో రోజూ గురువుల గగ్గోలు
రెండో రోజు సర్వర్ డౌన్
సెలవు కోసం దరఖాస్తు చేస్తే.. డ్యూటీకి వచ్చినట్టు నమోదు
డివైజ్లు ఇస్తేనే ఆన్లైన్ హాజరు వేస్తామన్న టీచర్లు
జిల్లావ్యాప్తంగా ఎంఈవోలకు హెచ్ఎంలకు లేఖలు
‘విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ యాప్ను మా సొంత ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోలేం. ఈ యాప్వల్ల మా వ్యక్తిగత సమాచారానికి భద్రత ఉండదు. ప్రభుత్వమే టీచర్ల అటెండెన్స్ నమోదు డివైజ్లు ఇచ్చేంత వరకు హాజరు నమోదు చేయం’
-ఇదీ జిల్లాలో పాఠశాలల హెచ్ఎంలు, ఎంఈవోలకు టీచర్లు బుధవారం అందజేసిన లేఖల సారాంశం.
ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం తది తర వివరాలు అప్లోడ్ చేసేందుకు ఇంటిగ్రేటెడ్ యాప్పై అభ్యంతరం చెబుతున్నాం. ఆన్లైన్ హాజరు యాప్పై టీచర్లు అనాసక్తత తెలియ జేస్తున్నారు. ప్రభుత్వమే హెచ్ఎంల వద్ద డివైజ్లను ఏర్పాటు చేసి ఉపాధ్యాయులతో హాజరు వేయిస్తేనే మాకు అంగీకారం.
– డీఈవో గంగాభవానివద్ద ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా నాయకుల మాట.
‘ఉపాధ్యాయుల ఆన్లైన్ హాజరు నమోదుకు వస్తున్న అభ్యంతరాలన్నీ టీచర్ యూనియన్ల నాయకుల నుంచే తప్ప ఎవరి నుంచీ వ్యతిరే కత లేదు. సర్వర్ సాంకేతిక సమస్యలు పరి ష్కారమవుతాయి. హాజరు నమోదు మెరు గైంది. 20 శాతం మంది టీచర్లు బుధవారం ఆన్లైన్ హాజరు నమోదు చేశారు.
– విద్యాశాఖకు ఉన్నతాధికారుల సంకేతాలు.
ఏలూరు ఎడ్యుకేషన్, ఆగస్టు 17 : టీచర్ల ఆన్లైన్ హాజరు(Online attendance of teachers) నమోదులో జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులు బుధవారం వరుసగా రెండో రోజు కూడా గందరగోళ పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఫ్యాప్టో పిలుపు మేరకు ఆన్లైన్ హాజరు నమోదుకు నిరాకరించారు. మరోవైపు హాజరు నమోదుకు ప్రవేశపెట్టిన ‘సిమ్స్–ఏపీ’ యాప్ చాలాచోట్ల పనిచేయలేదు. కొన్నిచోట్ల యాప్లో రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నించినా ఫెయిల్ అని వచ్చింది. మరికొన్ని పాఠశాలల్లో విచిత్ర పరిస్థి తులు ఎదురయ్యాయి. సాధారణ సెలవు కోసం యాప్లో దరఖాస్తు చేసేందుకు ప్రయత్నించిన కొందరు ఉపాధ్యాయులకు ఇన్ టైంలో స్కూలుకు హాజరైనట్టుగా చూపించడంతో అవాక్కయ్యారు. మరికొన్ని సాంకేతిక సమస్యలు గందరగోళంలో పడేశాయి. ఉదయం హాజరు నమోదైన వారిలో కొందరికి సాయంత్రం విధులు ముగించుకుని వెళ్ళేటపుడు యాప్ ఓపెన్ కాకపోవడంతో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇక మెజార్టీ పాఠశాలల్లో ప్రభు త్వమే డివైజ్లను ఏర్పాటు చేస్తే తప్ప ఆన్లైన్ హాజరు వేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పేశారు. ఆ మేరకు ప్రాథమిక పాఠశాలల టీచర్లు తమ మండలాల ఎంఈవోలకు, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయు లు తమ హెచ్ఎంలకు లేఖలను అందజేశారు. లేఖల నమూనాలను ‘ఫ్యాప్టో’ జిల్లావ్యాప్తంగా స్థానికంగా వున్న తమ కేడర్ ద్వారా ఉపాధ్యా యులకు పంపింది. ఒకే స్కూలులో కొందరికి యాప్లో హాజరు నమోదవ్వగా మరికొందరికి ఫెయిల్ అని రావడం గమనార్హం. డీఈవో గంగాభవానికి వినతి పత్రాన్ని ఇచ్చిన అనంతరం ఫ్యాప్టో జిల్లా నాయకులు మాట్లా డుతూ ‘యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో కొందరు హాజరు వేయకపోతే ప్రభుత్వ చర్యలు ఉంటాయేమోనన్న భయాందోళనలతో అటెండెన్స్ వేసినట్టు మాకు సమాచారం అందింది. అయితే ఇంటిగ్రేటెడ్ అటెం డెన్స్ యాప్కు వారు తమ అభ్యంతరాన్ని తెలియజేశారు. ఇలాంటి వారిని కలుపుకుని గురువారం నుంచి యాప్ ద్వారా ఎవరూ హాజరు వేయకుండా మోటివేట్ చేస్తాం’ అని వివరించారు.
మరోవైపు ముఖగుర్తింపు హాజరు యాప్వల్ల ఉపాధ్యాయులు పడుతున్న ఆందోళనను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి బుధవారం డెమొక్రటిక్ పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశ్వరరావు తదితరులు తీసుకెళ్లారు. ఈ సమస్యను విద్యాశాఖ మంత్రితో మాట్లాడి పరిష్కరించేందుకు ఆయన హామీ ఇచ్చారని, టీచర్లు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారని సంఘ నాయకులు వివరించారు. ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ హాజరు వేయడం కొత్తేమీ కాదని, కొత్త యాప్లో సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండానే ఉదయం తొమ్మిది గంటలు దాటితే సెలవుగా పరిగణిం చడం, జీతాలకు, అటెండెన్స్తో లింకప్ చేస్తామ నడం ఉపాధ్యాయులపై మానసిక ఒత్తిడి, ఆం దోళన పెంచుతున్నాయని, ఫలితంగా విద్యా వ్యవస్థపై పరోక్ష ప్రభావం చూపుతాయని పీఆర్టీ యూ జిల్లా అధ్యక్షుడు పి.ఆంజనేయులు అభ్యం తరాన్ని చెప్పారు. యాప్లో హాజరు నమోదును నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ డీఈవో గంగాభవానికి వినతి పత్రాన్ని అందజేసిన ఫ్యాప్టో సభ్య సంఘాల జిల్లా నాయకుల్లో రవికుమార్, నరసింహారావు, రత్నబాబు, రెడ్డిదొర, శాస్త్రి, వెంకటేశ్వరరావు, కృష్ణ, నారాయణ, రమణ, షేక్ ముస్తఫాఅలీ, అనంత తదితరులు ఉన్నారు.
విద్యార్థులపైనా ప్రభావం
ఇప్పటి వరకు విద్యార్థుల హాజరుకే పరిమితం చేసిన యాప్లోనే కొత్తగా టీచర్లు, మధ్యాహ్న భోజన పథకం, విద్యా కానుక కిట్లు తదితర వివరాలను అప్లోడ్ చేసేలా ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ యాప్ సర్వర్పై ఒకేసారి లోడ్ పడటం, లేదా యాప్ ఓపెన్ కాకపోవడం వల్ల మంగళవారం నుంచి జిల్లాలో చాలా చోట్ల విద్యార్థుల హాజరు నమోదు కాలేదు. జిల్లాలో దాదాపు 90–95 శాతం మంది విద్యార్థుల హాజరు ఇంత వరకు నమోదయ్యేదని, ఇప్పుడు అన్నింటికీ కలిపి ఒకే యాప్ ఇవ్వడం వల్ల ఓపెన్ కాకపోవడంతో మాన్యువల్ విధానంలో హాజరును నమోదు చేసినట్టు పలువురు హెచ్ఎంలు వివరించారు.