‘మల్లన్న దర్శనానికి ఆనలైన బుకింగ్ తప్పనిసరి’
ABN , First Publish Date - 2022-01-20T04:28:09+05:30 IST
శ్రీశైల క్షేత్ర పరిధిలో కొవిడ్ నియంత్రణ ఆంక్షలను దేవస్థానం కట్టుదిట్టం చేసింది.
శ్రీశైలం, జనవరి 19: శ్రీశైల క్షేత్ర పరిధిలో కొవిడ్ నియంత్రణ ఆంక్షలను దేవస్థానం కట్టుదిట్టం చేసింది. కొవిడ్ నియంతత్రణ ముందస్తు చర్యలలో భాగంగా దేవదాయ కమిషనరు ఆదేశాల మేరకు స్వామివారి స్పర్శదర్శనం, అమ్మవారి అంతరాలయ దర్శనాలు, స్వామివారి గర్భాలయ అభిషేకాలు నిలుపుదల చేశారు. భక్తులందరికీ స్వామివారి లఘు దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. ఆలయంలో శఠారి, తీర్థం, ఉచిత ప్రసాద వితరణ, వేదాశీర్వచనం తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అలాగే దేవస్థానంలో నిర్వహించే అన్ని ఆర్జితసేవల టికెట్లను 50 శాతం తగ్గించి పరిమిత సంఖ్యలో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ఆర్జితసేవా టికెట్లను భక్తులు కేవలం ఆనలైన ద్వారా పొందాల్సి ఉంటుందని, కరెంట్ బుకింగ్ నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్షేత్రానికి వచ్చే భక్తులు శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం టికెట్లను దేవస్థానం వెబ్సైట్ శ్రీశైలదేవస్థానం. ఓఆర్జి ద్వారా బుకింగ్ చేసుకొని క్షేత్రానికి రావాలన్నారు. దర్శనం బుకింగ్లో కొవిడ్ వ్యాక్సినేషన ధృవీకరణ పత్రం తప్పనిసరి చేసింది. వృద్ధులు, గర్భిణులు, చంటిపిల్లల తల్లులు, 10 సంవత్సరాల పిల్లలు తమ యాత్రను వాయిదా వేసుకోవాలని కోరారు. భక్తులు తమకు కేటాయించిన నిర్దిష్ట సమయాలలో మాత్రమే దర్శనానికి, ఆర్జిత సేవలకు విచ్చేయాలన్నారు. జలుబు జ్వరం, దగ్గు వంచి లక్షణాలు ఉంటే ఆలయంలోకి అనుమతి లేదన్నారు. కొవిడ్ కారణంగా భక్తులకు అన్నప్రసాద వితరణను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. కొవిడ్ నియంత్రయ చర్యలలో భాగంగా పాతాళగంగలో స్నానాలతో పాటు రోప్వే, బోటింగ్ కూడా నిలిపివేశారు.