ఆశ్రయం ఇస్తే.. ఆమె భర్తనే పెళ్లాడతానంటోంది..
ABN , First Publish Date - 2022-04-16T14:49:11+05:30 IST
ఆన్లైన్లో పరిచయమైన యువతి చదువుకునేందుకు ఆశ్రయం కల్పించాలని ఓ వివాహితను కోరింది. ఆమె భర్తను ఒప్పించి
తప్పేంటంటున్న ఆన్లైన్ ఫ్రెండ్
పోలీసులను ఆశ్రయించిన దంపతులు
హైదరాబాద్ సిటీ: ఆన్లైన్లో పరిచయమైన యువతి చదువుకునేందుకు ఆశ్రయం కల్పించాలని ఓ వివాహితను కోరింది. ఆమె భర్తను ఒప్పించి యువతికి ఆశ్రయం కల్పించింది. మంచి ఉద్యోగం వచ్చే వరకూ మీ ఇంట్లో ఉన్నట్లే ఉండొచ్చని దంపతులు యువతికి చెప్పారు. కొద్ది రోజుల తర్వాత దంపతులకు ఆ యువతి షాక్ ఇచ్చింది. మహిళ భర్తను పెళ్లి చేసుకుంటానని వేధించడం మొదలుపెట్టింది. అదేంటని అడిగితే తప్పేంటని ప్రశ్నిస్తోంది. బయటకు పొమ్మంటే వెళ్లడం లేదు. ఏం చేయాలో అర్థం కాని ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు.
నగరానికి చెందిన దామోదర్, నందిని (పేర్లు మార్చాం) భార్యాభర్తలు. భర్త లెక్చరర్. భార్య సివిల్స్కు ప్రిపేరవుతోంది. వారికి పిల్లలు లేరు. నందినికి తనలాగే కాంపిటేటివ్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతి ఆన్లైన్లో పరిచయమైంది. ఇద్దరూ ప్రిపరేషన్ గురించి మాట్లాడుకునేవారు. అలా స్నేహితులయ్యారు. ఈ క్రమంలో ఆ యువతికి చదువంటే బాగా ఇష్టమని, ఉద్యోగం కోసం శ్రమిస్తోందని, ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో సిటీకి వచ్చి ప్రిపేర్ కాలేకపోతున్నట్లు తెలుసుకుంది. తమ ఇంట్లో ఉండి తనతోపాటు చదువుకునేందుకు భర్తను ఒప్పించింది. ఆ యువతి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొన్న దామోదర్ భార్య మాటను కాదనలేకపోయాడు.
తల్లిదండ్రులకు చెప్పినా..
ఆశ్రయం కల్పించిన ఆమెకు విధేయురాలిగా ఉండాల్సిన యువతి రెండు నెలల తర్వాత చదువును పక్కన పెట్టేసింది. ఆ దంపతులకు పిల్లలు లేరని తెలుసుకుంది. ఇటీవల భార్యాభర్తలను ఒక్కచోట కూర్చోబెట్టి ‘నేను నీ భర్తను పెళ్లి చేసుకుంటాను. రెండో పెళ్లాంగా ఉంటాను’ అని షాకిచ్చింది. ఆ యువతి మాటలకు వారికి నోట మాటరాలేదు. ‘చదువుకొని ఉద్యోగం సంపాదించుకుంటావు అని ఇంటికి రమ్మంటే నా ఇంటికే ఎసరుపెడతావా..?’ అని నందిని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ఆమె పట్టువీడలేదు. యువతి అమ్మానాన్నలను పిలిపిస్తే వాళ్లు కూడా ‘ఎలాగో నీకు పిల్లలు లేరు కదా.. మా అమ్మాయి రెండో భార్యగా ఉంటుందిలే’ అని సమాధానం చెప్పారు. ఏం చేయాలో అర్థం కాని దంపతులు సైబరాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి గోడు వెళ్లబోసుకున్నారు. ఇది భార్యా భర్తల గొడవ కాదని, దీన్ని ఇరుపక్షాల సమక్షంలో మీరే పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. తెలియని వారిని ఇంటికి ఆహ్వానించి లేనిపోని చిక్కులు కొని తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు.