Helpline no: ఆన్లైన్ మోసాలకు చెక్
ABN , First Publish Date - 2022-09-17T15:32:57+05:30 IST
చెన్నై మహానగరంలో ఆన్లైన్ మోసాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ మోసాలకు చెక్ పెట్టేందుకు నగర సైబర్ క్రైమ్ విభాగం(City Cyber
- హెల్ప్లైన్ నంబరు ఏర్పాటు
- 24 గంటల్లో డబ్బు రికవరీ
అడయార్(చెన్నై), సెప్టెంబరు 16: చెన్నై మహానగరంలో ఆన్లైన్ మోసాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ మోసాలకు చెక్ పెట్టేందుకు నగర సైబర్ క్రైమ్ విభాగం(City Cyber Crime Unit) మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. ఇందులోభాగంగా, సైబర్నేరగాళ్ళ చేతిలో మోసపోయే బ్యాంకు ఖాతాదారులకు తక్షణం సాయంచేసేందుకు వీలుగా సైబర్ నేర పరిశోధనా విభాగం సరికొత్త హెల్ప్లైన్ నంబరు(Helpline no) ప్రవేశపెట్టింది. బాధితులు ‘155260’ నంబరుకు ఫోన్ చేసినట్టయితే 24 గంటల్లో డబ్బు రికవరీ అయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. ఇదే విషయంపై సైబర్ క్రైమ్ విభాగం ఇన్స్పెక్టర్ కార్తికేయన్ ఒక ఆడియో సందేశాన్ని తాజాగా విడుదల చేశారు. ఇందులో ‘సైబర్ నేరగాళ్ళ చేతిలో డబ్బు కోల్పోయే బ్యాంకు ఖాతాదారులు మోసం జరిగిన 24 గంటల్లో ‘155260’ అనే హెల్ప్లైన్ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చు. అయితే, ఏటీఎం కేంద్రాల్లో జరిగే మోసాలకు మాత్రం ఇది వీలుపడదు. ఆన్లైన్ ద్వారా సైబర్ నేరగాళ్లు తస్కరించే డబ్బుపై ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే అంత త్వరగా ఆ డబ్బు రికవరీ చేయవచ్చు. ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో ఖాతాకు ఆన్లైన్ ద్వారా డబ్బు జమ చేసేందుకు కనీసం అరగంట సమయం పడుతుంది. ఈలోగా హెల్ప్లైన్ నంబరుకు ఫిర్యాదు చేస్తే తక్షణం డబ్బు రికరీ చేయవచ్చు. 24 గంటల్లో ఫిర్యాదు చేసినప్పటికీ డబ్బును తిరిగి బ్యాంకు ఖాతాలోకి జమ చేసేలా చర్యలు తీసుకోవచ్చు. తక్షణం ఫిర్యాదు చేస్తే బ్యాంకు ఖాతా నుంచి డబ్బు జమ చేయడం నిలిపివేయడం జరుగుతుంది. తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి తిరిగి డబ్బును పొందవచ్చు. అదేసమయంలో బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం.. ఓటీపీ నంబరు చెప్పాలని ఎవరైనా ఫోన్ చేసినా, మొబైల్కు వచ్చిన ఏదైనా లింకు క్లిక్ చేయమని చెప్పినా అవి పట్టించుకోవద్దని ఆ సందేశంలో పేర్కొన్నారు.