భవానీ భక్తులకు దర్శనం మాత్రమే..
ABN , First Publish Date - 2020-11-29T06:15:07+05:30 IST
భవానీ భక్తులకు దర్శనం మాత్రమే..
నదీస్నానాలు, తలనీలాల సమర్పణ, గిరి ప్రదక్షిణలు రద్దు
విజయవాడ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై జనవరి 5 నుంచి 9వ తేదీ వరకు జరిగే భవానీ దీక్షల విరమణ ఉత్సవాల్లో అధికారులు నిబంధనలు పక్కాగా అమలు చేయనున్నారు. ఈ ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా అమలుచేస్తూ రోజుకు పదివేల మంది భవానీ భక్తులకే దుర్గమ్మ దర్శనం కల్పిస్తామని, కృష్ణానదిలో పుణ్యస్నానాలు, అమ్మవారికి తలనీలాల సమర్పణ, గిరి ప్రదక్షిణలను రద్దు చేసినట్టు దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్బాబు తెలిపారు. భవానీ దీక్ష మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఆన్లైన్లో ఉచిత టికెట్లు జారీచేసే ప్రక్రియను శనివారం దేవస్థానంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడుతో కలిసి ఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దసరా ఉత్సవాల మాదిరిగానే భక్తులకు క్యూలైన్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వివరించారు. భవానీ భక్తులు ఇరుముడులను దేవస్థానంలో సమర్పించి, మాల విరమణ మాత్రం ఎక్కడ దీక్ష చేపట్టారో అక్కడే గురుభవానీ సమక్షంలో చేయాలని కోరారు.
డాక్టర్ దారుణ హత్య
అవనిగడ్డ టౌన్, నవంబరు 28 : అవనిగడ్డలో ప్రముఖ వైద్యుడిగా పేరొందిన డాక్టర్ కోట శ్రీహరిరావు(65) శనివారం దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ శ్రీహరిరావు భార్య, కుమార్తె శుక్రవారం మధ్యాహ్నం ఊరుకు వెళ్లారు. డాక్టర్ ఒక్కరే ఇంట్లో ఉన్నారు. తెల్లవారుజామున ఆయన బయటకు వెళ్లాల్సి ఉంది. ఎంతకీ ఇంట్లో నుంచి బయటకు రాకపోవటంతో వైద్యశాలలో ఉన్న నర్సు ఫోన్ చేశారు. స్పందన రాకపోవడంతో పై అంతస్తులోకి వెళ్లి చూసింది. తలుపు తెరిచి ఉంది. పిలిచినా పలకక పోవటంతో లోపలకు వెళ్లి చూడగా, పడకగదిలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న డాక్టర్ శ్రీహరిరావు కనిపించారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్బాబు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని డాక్టర్ మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానా స్పదంగా ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సీసీ కెమెరాల్లో పడకుండా..
ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు పైకి తిప్పి ఉండటం, కనెక్షన్లను సైతం కత్తిరించి ఉండటంతో మృతిపై అనుమానాలు కలుగుతున్నాయి. అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ భాష, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ ధర్మేంద్ర, సీఐ రవికుమార్, ఎస్సై సందీప్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎస్పీ ఎం.రవీంద్రనాథ్బాబు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరిస్తున్నాయన్నారు.
రక్తపు మడుగులో డాక్టర్ శ్రీహరిరావు