ఇంద్రాణీ ముఖర్జియాకు ఊరట

ABN , First Publish Date - 2022-05-19T08:15:20+05:30 IST

ఏడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

ఇంద్రాణీ ముఖర్జియాకు ఊరట

షీనాబోరా హత్య కేసులో బెయిల్‌ 

న్యూఢిల్లీ, మే 18: ఏడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎట్టకేలకు న్యాయమూర్తి ఆమెకు బెయుల్‌ మంజూరు చేశారు. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. ఆమె తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ’’ఈ కేసులో నిజానిజాల గురించి నేను మాట్లాడడం లేదు. కానీ, విచారణ మాత్రం ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. సాక్షుల్లో సగం మందిని విచారించాలన్నా.. చాలా సమయం పట్టేలా ఉంది. నిందితురాలు ఆరున్నరేళ్లుగా జైల్లోనే ఉన్నారు. ఇది మరీ ఎక్కువ సమయం. కాబట్టి ఆమెకు బెయిల్‌ మంజూరు చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఇంద్రాణీ.. 2015 నుంచి జైల్లోనే ఉంటున్న విషయం తెలిసిందే. కాగా, షీనాబోరా హత్య 2012లో జరగ్గా.. 2015లో వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో అరెస్టయిన ఇంద్రాణీ కారు డ్రైవర్‌ను విచారిస్తున్న పోలీసులకు.. షీనా హత్య విషయం తెలిసింది. ఆమెను ఇంద్రాణీ.. గొంతు నులిమి హత్య చేశారని అతడు పోలీసులకు చెప్పాడు. ఈ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు.. ఇంద్రాణిని అరెస్టు చేశారు. 

Updated Date - 2022-05-19T08:15:20+05:30 IST