పార్లమెంట్‌లో వ్యూహం మార్చిన ప్రతిపక్షాలు!

ABN , First Publish Date - 2021-12-02T23:12:48+05:30 IST

పార్లమెంటులో అనుసరించవలసిన వ్యూహాన్ని ప్రతిపక్షాలు మార్చుకున్నాయి

పార్లమెంట్‌లో వ్యూహం మార్చిన ప్రతిపక్షాలు!

న్యూఢిల్లీ : పార్లమెంటులో అనుసరించవలసిన వ్యూహాన్ని ప్రతిపక్షాలు మార్చుకున్నాయి. 12 మంది ప్రతిపక్ష రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్‌పై నిరసన వ్యక్తం చేస్తూనే, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించరాదని, ప్రధాన సమస్యలపై చర్చ కోసం పట్టుబట్టాలని నిర్ణయించాయి. 


విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, 12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్‌పై నిరసనను కొనసాగిస్తూనే, ప్రధాన సమస్యలపై చర్చ కోసం పట్టుబట్టాలని ప్రతిపక్ష నేతలు నిర్ణయించారు. కోవిడ్-19 మహమ్మారి, సాగు చట్టాలపై నిరసన కార్యక్రమాల్లో పాల్గొని, ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం, చైనాతో సంఘర్షణ, ధరల పెరుగుదల, వరదలు వంటి సమస్యలపై చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వం సభలో ప్రతిపాదించే బిల్లులపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని కూడా నిర్ణయించారు. 


ప్రభుత్వానికి కాస్త వెసులుబాటు కల్పించాలని, ముఖ్యమైన బిల్లులకు ఆమోదం పొందడానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు ఓ సీనియర్ ప్రతిపక్ష నేత చెప్పారు. సస్పెండయిన రాజ్యసభ సభ్యులతో కలిసి గాంధీ విగ్రహం వద్ద నిరసనలో పాల్గొనాలని కాంగ్రెస్ కూడా నిర్ణయించిందన్నారు. 


ఇదిలావుండగా సస్పెండయిన రాజ్యసభ సభ్యులను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలిసి, సంఘీభావం ప్రకటించారు. వీరు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసే వరకు తమను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయడానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు. 


Updated Date - 2021-12-02T23:12:48+05:30 IST