Warangal: రాకేష్ కుటుంబానికి ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు

ABN , First Publish Date - 2022-06-27T19:22:23+05:30 IST

సికింద్రాబాద్ కాల్పుల్లో చనిపోయిన రాకేష్ కుటుంబానికి నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగం కల్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Warangal: రాకేష్ కుటుంబానికి ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు

వరంగల్: సికింద్రాబాద్ కాల్పుల్లో చనిపోయిన రాకేష్ కుటుంబానికి నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగం కల్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాకేష్ కుటుంబానికి రూ.25 లక్షల రూపాయల చెక్, ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, కలెక్టర్ గోపీ, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్ పాల్గొన్నారు. అనంతరం రాకేష్ సంతాప సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ... అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయకుంటే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. మోదీ నల్ల చట్టాల వల్ల 700 మంది రైతులు చనిపోయారన్నారు. రాకేష్ మృతిని కొందరు రాజకీయం కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. సికింద్రాబాద్ కాల్పుల్లో మొదట రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించకుండా డైరక్ట్ బుల్లెట్స్ ఉపయోగించారని... దీని వెనక కుట్ర ఉందని ఆరోపించారు. సైనికుల పట్ల కిషన్ రెడ్డి మాటలు అవమానకరంగా ఉన్నాయని మంత్రి అన్నారు. కనీసం రాకేష్ కుటుంబాన్ని ఆదుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. రాకేష్ కుటుంబాన్ని సీఎం దగ్గరకు తీసుకెళ్తామని, మరింత ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాకేష్ గ్రామం డబ్బీర్ పేటను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వెల్లడించారు. 


ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ...  ఉద్యోగం కోసం చేసిన పోరాటంలో రాకేష్ చనిపోయారన్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా ధృక్పథంతో ఆలోచించి రూ.25లక్షల ఎక్స్ గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం కల్పించారని తెలిపారు. 

Updated Date - 2022-06-27T19:22:23+05:30 IST