పాతాళం నుంచి అథఃపాతాళానికి మన పశువైద్యం

ABN , First Publish Date - 2020-12-31T06:04:53+05:30 IST

ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో అనేక పశువైద్యశాలలను, పథకాలను అమలు చేస్తున్నాయి...

పాతాళం నుంచి అథఃపాతాళానికి మన పశువైద్యం

ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో అనేక పశువైద్యశాలలను, పథకాలను అమలు చేస్తున్నాయి. వనరులు, అవసరాలను గుర్తించకుండా కేవలం ప్రాంతీయ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రారంభించిన పశువైద్య కళాశాలలు నిధులు, అధ్యాపకులు, ఇతర మౌలిక వసతులు లేక విలవిల్లాడుతున్నాయి. ఒకప్పుడు విద్యా ప్రమాణాలలో దేశంలోని అగ్రస్థానాలలో ఉన్న మన పశువైద్య కళాశాలలు ఇప్పుడు అథమస్థానాల అంచుకు చేరటం చాలా బాధకరం!


వైద్యేతర విధుల వల్ల, బాధ్యతారాహిత్యం, రాజకీయాలు, కులతత్వం, దక్షత లోపించిన పరిపాలన, అవినీతి, అలసత్వం వల్ల గ్రామాలలోని పశు సంపదకు సరియైున వైద్యసేవలు సకాలంలో అందడం లేదు. దాంతో పశువులు వాటి యజమానులు తీవ్ర కష్టనష్టాలకు గురి అవుతున్న వాస్తవాలు మనకు చాలా గ్రామాలలో కనిపిస్తాయి. అర్ధరాత్రి, తొలిసంధ్య వేళల్లో పశువులకు అవసరమైన వైద్యసేవలకు గ్రామీణ రైతులు తరచూ పశువైద్య సహాయకులు, అటెండర్లు, గోపాలమిత్రులు, నాటువైద్యులు వంటి వైద్యులలో తగిన శిక్షణ లేని వ్యక్తుల చేత వైద్యం పొందవలసిన దుస్థితి ఏర్పడింది. వీరి అవగాహనారాహిత్యం, అశుభ్రత, పశువుల పట్ల నిర్లక్ష్య ధోరణి, కాఠిన్యాల వల్ల పశువైద్య శాఖ మొత్తానికి ఉన్న గౌరవం, నమ్మకాలు క్షీణిస్తున్నాయి కూడా!


ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ పశుసంవర్థకశాఖ సంచాలకులు ఒక ఉత్తర్వులో పశువైద్య సహాయకుల నియామకాల కోసం నోటిఫికేషన్‌ జారీ చేశారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ, ముఖ్యంగా వాటి లైంగిక ఆరోగ్య పరిరక్షణ విధులను నిర్వహించవలసిన ఈ సహాయకులకు 10వ తరగతి కనీస విద్యార్హత. దీనితో పాటు 150 మార్కులు కలిగిన ప్రవేశ అర్హత పరీక్షలలో కేవలం ఒకే ఒక్క మార్కు వచ్చినా, వారు ఈ ఉద్యోగాలకు అర్హులేనని ఆ సంచాలకులు ఈ ఏడాది నవంబర్‌ 11న జారీచేసిన ఉత్తర్వు పశువుల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతారాహిత్యాన్ని స్పష్టం చేస్తోంది. ఇది కేవలం కొన్ని వర్గాలకు చెందిన అనర్హులతో వందలాదిగా ఉన్న ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశ్యం నేతలకు ఉన్నట్లు అనుమానించవలసిన పరిస్థితి కల్పిస్తోంది. మనుషుల వైద్యం కంటే క్లిష్టమైన నోరులేని పశువులకు చేసే వైద్యంలో కీలకపాత్ర వహించవలసిన ఈ సహాయకులకు కృత్రిమ గర్భధారణతో పాటు పశువుల గర్భకోశ పరీక్షలు, చూడి పరీక్షలు, ఇతర ప్రాథమిక వైద్యాన్ని అందించాల్సిన బాధ్యతలుంటాయి. అటువంటి ఈ సహాయకులకు 150కి ఒక్క మార్కు అంటే 0.66 శాతం మార్కులొస్తే చాలు అనడంలో ఏమాత్రం హేతుబద్ధత లేదు. దయచేసి ఈ ఉద్యోగాలకు కనీస ప్రతిభ, విజ్ఞానం ఉండే విధంగా ఈ మార్కుల్ని 50 శాతం ఉండేలా ప్రభుత్వం నిర్ణయించాలి. అలాగని ఆవుకు ఎన్ని కాళ్ళు, గేదె రంగు ఏమిటి వంటి మరీ సరళమైన ప్రశ్నలతో పరీక్షల్ని మ-మ అనిపించే తంతుకు పాల్పడవద్దని నా మనవి.

ఎం.వి.జి అహోబలరావు

Updated Date - 2020-12-31T06:04:53+05:30 IST