గూగుల్ బ్లాక్‌చైన్ డివిజన్‌కు మన హైదరాబాదీ ఇంజినీరు నాయకత్వం!

ABN , First Publish Date - 2022-01-23T00:05:00+05:30 IST

ప్రపంచ స్థాయి కంపెనీలకు నాయకత్వం వహించే భారతీయుల

గూగుల్ బ్లాక్‌చైన్ డివిజన్‌కు మన హైదరాబాదీ ఇంజినీరు నాయకత్వం!

న్యూఢిల్లీ : ప్రపంచ స్థాయి కంపెనీలకు నాయకత్వం వహించే భారతీయుల జాబితాలోకి శివకుమార్ వేంకటరామన్ చేరారు. ఆయన గూగుల్ నూతన బ్లాక్‌చైన్ డివిజన్‌ అధిపతిగా నియమితులయ్యారు. ఆయనకు గూగుల్‌తో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. ఈ కంపెనీ కోర్ బిజినెస్ అయిన సెర్చ్ అడ్వర్టయిజింగ్‌ కోసం ఆయన కృషి చేశారు. 


ఓ వార్తా సంస్థ శనివారం తెలిపిన వివరాల ప్రకారం, బ్లాక్‌చైన్, దానికి సంబంధించిన టెక్నాలజీలకు ప్రత్యేకంగా ఓ గ్రూపును గూగుల్ ఏర్పాటు చేసింది. దీని నాయకత్వ బాధ్యతలను ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ శివ కుమార్ వేంకటరామన్‌కు అప్పగించింది. నెక్స్ట్ జనరేషన్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్, డేటా స్టోరేజ్ టెక్నాలజీస్‌ రంగంలో ఈ విభాగం పని చేస్తుంది. 


ఇప్పటి వరకు బ్లాక్‌చైన్ టెక్నాలజీపై పని చేస్తున్న కంపెనీలకు కొన్ని క్లౌడ్ సర్వీసెస్‌ను గూగుల్ అందిస్తోంది. కానీ ఈ రంగంలో పబ్లిక్ ప్రాజెక్టులను ప్రారంభించలేదు. ప్రయోగాలకు ప్రసిద్ధి చెందిన ఈ కంపెనీకి ప్రత్యర్ధి కంపెనీలైన మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్, ట్విటర్ ఇంక్ ఈ రంగంలో చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులు పెట్టాయి. ఇదిలావుండగా గూగుల్‌ పేమెంట్స్, కామర్స్ ప్రెసిడెంట్ ఇటీవల తెలిపిన వివరాల ప్రకారం, క్రిప్టోపై ఈ కంపెనీ బాగా దృష్టి పెట్టింది. 


శివ కుమార్ మన హైదరాబాదీయే!

శివ కుమార్ వేంకటరామన్ (52) మన హైదరాబాద్‌కు చెందినవారే. 1990లో ఆయన ఐఐటీ-చెన్నైలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. అనంతరం అమెరికాలోని University of Wisconsin-Madisonలో కంప్యూటర్ సైన్స్‌లో డాక్టరేట్ చేశారు. Hewlett-Packard Laboratoriesలో సమ్మర్ ఇంటర్న్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఐబీఎంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా చేరారు. ఆయన 2003లో గూగుల్‌లో చేరారు. కోర్ సెర్చ్ అడ్వర్టయిజ్‌మెంట్ బిజినెస్ బాధ్యతలను స్వీకరించే స్థాయికి ఎదిగారు. ఇటీవలే పునరుద్ధరించిన గూగుల్ ల్యాబ్స్ డివిజన్‌ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందారు. 


Updated Date - 2022-01-23T00:05:00+05:30 IST