Amarnath Yatra : భారీ వర్షాల బీభత్సం... సురక్షిత ప్రాంతానికి 15 వేల మంది తరలింపు...
ABN , First Publish Date - 2022-07-09T18:31:13+05:30 IST
జమ్మూ-కశ్మీరులో కుండపోత వర్షాలతో వరదలు సంభవించాయి
శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరులో కుండపోత వర్షాలతో వరదలు సంభవించాయి. దీంతో కొండచరియలు విరిగిపడి భయానక వాతావరణం ఏర్పడింది. అత్యంత పవిత్రమైన అమర్నాథ్ యాత్రకు వెళ్ళిన భక్తులు చాలా ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. దాదాపు 15,000 మంది భక్తులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. సుమారు 16 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 40 మంది ఆచూకీ తెలియడం లేదు. భద్రతా దళాలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టాయి.
శుక్రవారం సాయంత్రం నుంచి కురుస్తున్న కుంభవృష్టి వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి, వరదలు సంభవించాయి. దీంతో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. దిగువన పంచతరణిలో ఉన్న బేస్ కేంప్ వద్దకు దాదాపు 15,000 మందిని సురక్షితంగా తరలించినట్లు అధికారులు చెప్పారు. భారత సైన్యం, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) సిబ్బంది శుక్రవారం రాత్రి సమయంలో కూడా నిరంతరాయంగా సహాయ కార్యక్రమాలను చేపట్టారు. 75 మంది సిబ్బందితో మూడు సహాయక బృందాలను ఎన్డీఆర్ఎఫ్ మోహరించింది. భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన సామూహిక భోజన శాలలు, గుడారాలు ధ్వంసమయ్యాయి.
ఇదిలావుండగా, ఈ వరదల్లో అమర్నాథ్ భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ (Ramnath Kovind), ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వరదల్లో చిక్కుకున్న భక్తులను కాపాడేందుకు సత్వరమే, వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేంద్ర దళాలను, జమ్మూ-కశ్మీరు పరిపాలనా యంత్రాంగాన్ని ఆదేశించారు.
అమర్నాథ్ (Amarnath) భక్తుల సమాచారాన్ని తెలుసుకునేందుకు జమ్మూ-కశ్మీరు (Jammu and Kashmir) పరిపాలనా యంత్రాంగం హెల్ప్లైన్ నంబర్లను ప్రకటించింది.
NDRF: 011-23438252, 011-23438253
Kashmir Divisional Helpline: 0194-2496240
Shrine Board Helpline: 0194-2313149