51 రోజుల్లో కువైట్‌ను వీడిన 18వేల మంది ప్రవాసులు !

ABN , First Publish Date - 2021-03-06T15:50:16+05:30 IST

కేవలం 51 రోజుల వ్యవధిలోనే ఏకంగా 18వేల మంది ప్రవాసులు కువైట్‌ను వదిలి వెళ్లినట్లు తాజాగా ఆ దేశ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) వెల్లడించింది.

51 రోజుల్లో కువైట్‌ను వీడిన 18వేల మంది ప్రవాసులు !

కువైట్ సిటీ: కేవలం 51 రోజుల వ్యవధిలోనే ఏకంగా 18వేల మంది ప్రవాసులు కువైట్‌ను వదిలి వెళ్లినట్లు తాజాగా ఆ దేశ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) వెల్లడించింది. జనవరి 12 నుంచి మార్చి 3వ తేదీ మధ్య మొత్తం 18వేల మంది ప్రవాసులు తమ దేశం నుంచి వెళ్లిపోయినట్లు పీఏఎం నివేదిక పేర్కొంది. వీరిలో 11,610 మంది కువైట్ వెలుపల ఉన్నందున వారి వర్క్ పర్మిట్స్ రద్దు అయ్యాయి. మరో 5,864 మంది శాశ్వతంగా ఆ దేశాన్ని విడిచిపెట్టి వచ్చేశారు. అలాగే 865 మంది మరణించగా, 436 మంది ఫ్యామిలీ వీసాకు మారిపోయినట్లు పీఏఎం తన నివేదికలో పొందుపరిచింది. 


ఇక ఇదే సమయంలో 14,574 మంది ప్రవాసుల వర్క్ పర్మిట్స్‌ను పునరుద్ధరించగా, 96 పర్మిట్స్‌ను ప్రభుత్వ సెక్టార్‌కు మార్చినట్లు పీఏఎం వెల్లడించింది. పీఏఎం వర్క్ పర్మిట్స్ రిపోర్ట్ ప్రకారం.. 596 కొత్త పర్మిట్స్ జారీ అవ్వగా, 60 పర్మిట్లు ప్రభుత్వ సెక్టార్‌కు మార్చడం జరిగింది. అలాగే 323 ఫ్యామిలీ వీసాల నుంచి మార్చబడినవి కాగా, 93 ఎంట్రీ వీసాల నుంచి మార్చబడ్డాయి. మొత్తంగా 204 వర్క్ వీసాలు ముద్రించడం జరిగిందని పీఏఎం పేర్కొంది.       

Updated Date - 2021-03-06T15:50:16+05:30 IST