Mayanmar: మయన్మార్లో ఉగ్రవాదుల చెరలో 60 మంది తమిళ టెకీలు.. వారితో సైబర్ నేరాలు చేయిస్తూ రోజూ చిత్రహింసలు
ABN , First Publish Date - 2022-09-21T13:17:01+05:30 IST
మయన్మార్లోని వియావాడి ప్రాంతంలో 60 మంది తమిళులను ఉగ్రవాదులు నిర్బంధించారు. వారితో సైబర్ నేరాలు చేయిస్తూ రోజూ చిత్రహింసలకు గురిచేస్తున్నారు.
చెన్నై, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మయన్మార్లోని వియావాడి ప్రాంతంలో 60 మంది తమిళులను ఉగ్రవాదులు నిర్బంధించారు. వారితో సైబర్ నేరాలు చేయిస్తూ రోజూ చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఉగ్రవాదుల చెరలో ఉన్న వారిని విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మక్కల్ నీదిమయ్యం అధినేత కమల్ హాసన్, పీఎంకే నేత డాక్టర్ రాందాస్ సహా పలువురు తమిళ రాజకీయ నేతలు డిమాండ్ చేశారు. మయన్మార్లోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఆధిపత్యం చెలాయిస్తూ సంఘవిద్రోహక చర్యలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం వారి చెరలో 300 మందికి పైగా భారతీయులు చిత్రహింసలు అనుభవిస్తున్నారు. వాళ్లంతా దుబాయ్, థాయ్లాండ్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న సమయంలో మయన్మార్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఉగ్రవాదుల చెరలో ఉన్న కొంతమంది తమిళ యువకులు తమ కుటుంబీకులకు రహస్య సమాచారం పంపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.