దేశంలో సగం మందికి అందిన సింగిల్ డోస్ వ్యాక్సిన్

ABN , First Publish Date - 2021-08-27T22:21:16+05:30 IST

దేశంలో అర్హులైన పెద్దల్లో (18 ఏళ్లు పైబడిన వారు) సగం మందికి పైగా సింగిల్ డోసు వ్యాక్సిన్ తీసుకున్నట్టు అధికార గణాంకాలు ..

దేశంలో సగం మందికి అందిన సింగిల్ డోస్ వ్యాక్సిన్

న్యూఢిల్లీ: దేశంలో అర్హులైన పెద్దల్లో (18 ఏళ్లు పైబడిన వారు) సగం మందికి పైగా సింగిల్ డోసు వ్యాక్సిన్ తీసుకున్నట్టు అధికార గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో హెల్త్ కేర్ వర్కర్లు 99 శాతం, ఫ్రంట్ లైన్ వర్కర్లు 100 శాతం ఉన్నారు. 60 ఏళ్లకు పైబడిన వారిలో కనీసం ఒక్క విడత వ్యాక్సిన్ డోస్ అయినా తీసుకున్న వారు 60 శాతం ఉన్నారు. ప్రస్తుతం 47.3 కోట్ల మంది తొలి డోసు వ్యాక్సిన్ తీసుకోగా, రెండో విడత వ్యాక్సిన్ కూడా తీసుకున్న వాళ్లు 13.8 కోట్లకు చేరారు. కోరనా మూడో వేవ్‌ రాకుండా నిరోధించే ప్రయత్నాల్లో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసిన నేపథ్యంలో ఈ గణాంకాలను ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ ఓ ట్వీట్‌లో తెలిపారు.


''భారత్ మరో గొప్ప మైలురాయిని చేరుకుంది. అర్హులైన వారిలో 50 శాతానికి పైగా ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు. కీపిటప్ ఇండియా...కరోనాతో కలిసి పోరాడదాం'' అని ఆ ట్వీట్‌లో మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ డాటా ప్రకారం, వ్యాక్సినేషన్ డ్రైవ్ మూడో దశ ప్రారంభమైనప్పటి నుంచి 18 నుంచి 44 ఏళ్ల లోపు వారు 23,18,95,731 మంది మొదటి డోసు తీసుకోగా, రెండో డోసు కూడా వేయించుకున్న వారు 2,33,74,357 మంది ఉన్నారు. ఈ ఏడాది చివరి కల్లా దేశంలోని అందరికీ వ్యాకినేషన్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.


Updated Date - 2021-08-27T22:21:16+05:30 IST