Omicron scare:మహారాష్ట్రకు విదేశాల నుంచి వచ్చిన 109మంది జాడ లేరు

ABN , First Publish Date - 2021-12-07T14:30:06+05:30 IST

మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియెంట్ ఒమైక్రాన్ వ్యాప్తి భయంతో ప్రజలు తీవ్ర కలవరపడుతున్నారు.

Omicron scare:మహారాష్ట్రకు విదేశాల నుంచి వచ్చిన 109మంది జాడ లేరు

ముంబై: మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియెంట్ ఒమైక్రాన్ వ్యాప్తి భయంతో ప్రజలు తీవ్ర కలవరపడుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒమైక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. విదేశాల నుంచి మహారాష్ట్రలోని పలు నగరాలకు వచ్చిన విదేశీయుల్లో కొందరి జాడ లేకుండా పోవడంతో వారికి ఒమైక్రాన్ వేరియెంట్ సోకిందేమోనని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.  థానే జిల్లాలోని టౌన్‌షిప్‌కు విదేశాల నుంచి 295 మంది రాగా, వారిలో 109 మంది జాడ తెలియడం లేదని కళ్యాణ్ డోంబివాలి మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ విజయ్ సూర్యవంశీ చెప్పారు.విదేశాల నుంచి వచ్చిన వారిలో కొందరి మొబైల్ ఫోన్లు స్విచాఫ్ ఉన్నాయి.


 విదేశీ ప్రయాణికులు ఇచ్చిన చిరునామాల్లో ఇళ్లకు తాళాలు వేసి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒమైక్రాన్ రిస్క్ ఉన్న దేశాల నుంచి మన దేశానికి వచ్చిన వారు కరోనా టెస్టుతో సంబంధం లేకుండా  7 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాలి. హోం క్వారంటైన్ అనంతరం 8వరోజు వారికి కొవిడ్ పరీక్ష చేస్తామని ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.అయితే విదేశాల నుంచి వచ్చిన 109 మంది జాడ తెలియక పోవడంతో ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి కోసం పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా గాలిస్తున్నామని వైద్యులు చెప్పారు. 

Updated Date - 2021-12-07T14:30:06+05:30 IST