20 శాతం వరకూ తగ్గిన వంటనూనెల ధరలు

ABN , First Publish Date - 2021-06-17T00:06:31+05:30 IST

వంటనూనెల ధరలు గత నెలరోజులుగా తగ్గుముఖం పట్టాయని వినియోగదారుల వ్యవహారాలు..

20 శాతం వరకూ తగ్గిన వంటనూనెల ధరలు

న్యూఢిల్లీ: వంటనూనెల ధరలు గత నెలరోజులుగా తగ్గుముఖం పట్టాయని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ బుధవారంనాడు ఒక ప్రకటనలో పేర్కొంది. కొన్ని రకాల వంటనూనెల ధరలు దాదాపు 20 శాతం వరకూ తగ్గినట్టు చెప్పింది. పామ్ ఆయిల్ కిలోకి 19 శాతం తగ్గి, రూ.115కు చేరిందని, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర కూడా 16 శాతం తగ్గిందని, కిలో రూ.157కు చేరిందని చెప్పింది.


కాగా, వినియోగదారుల వ్యవహారాల శాఖ వెబ్‌సైట్‌ ఈ గణాంకాల ప్రకారం, గత  ఏడాదిగా వేరుసెనగ నూన్, ఆవ నూనె, వనస్పతి, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్, పామాయిల్ వంటి 6 వంటనూనెల ధరలు దేశవ్యాప్తంగా 20 శాతం నుంచి 56 శాతం వరకూ పెరిగాయి. ఆవనూనె (ప్యాక్డ్) ధర గత ఏడాది మే 28 నాటికి రూ.117 ఉండగా, ఈ ఏడాది మే 28కి రూ.171కి చేరింది. అంటే 44 శాతం పెరిగింది. సోయా అయిల్, సన్ ‌ఫ్లవర్ ఆయిల్ ధరలు కూడా గత ఏడాదిగా 50 శాతానికి పెరిగాయి. 2021 మే నాటికి ఈ ఆరు వంటనూనెల ధరల పెరుగుదల 11 ఏళ్ల గరిష్టానికి చేరింది. అంతర్జాతీయంగా వంటనూనెల ధరలు పెరగడం వల్ల ఆ ప్రభావం దేశీయ ధరలపై పడినట్టు ఒక కారణంగా చెబుతున్నారు. వంటనూనెల పరంగా దేశ అవసరాల కోసం 56 శాతం దిగుమతులపై ఇండియా ఆధారపడుతోంది. వివిధ కారణాల రీత్యా గత కొద్ది నెలలుగా అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనెల ధరల్లో పెరుగుదల చోటుచేసుకుంది.

Updated Date - 2021-06-17T00:06:31+05:30 IST