Tennessee:మెరుపు వరదల్లో 22కు పెరిగిన మృతుల సంఖ్య
ABN , First Publish Date - 2021-08-23T12:41:03+05:30 IST
అమెరికా దేశంలోని టెన్నెస్సీ రాష్ట్రంలో వెల్లువెత్తిన మెరుపు వరదల్లో మృతుల సంఖ్య 22కు పెరిగింది....
మరో 50 మంది గల్లంతు
టెన్నెస్సీ (అమెరికా): అమెరికా దేశంలోని టెన్నెస్సీ రాష్ట్రంలో వెల్లువెత్తిన మెరుపు వరదల్లో మృతుల సంఖ్య 22కు పెరిగింది.అతి భారీవర్షాల వల్ల సంభవించిన వరదల వల్ల మరో 50 మంది గల్లంతు అయ్యారు. వరదల ధాటికి రోడ్లు, సెల్ ఫోన్ టవర్లు, టెలిఫోన్ లైన్లు, వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. వరదల వల్ల పలు ఇళ్లు కూలిపోయి ప్రజలు శిథిలాల్లో చిక్కుకొని మరణించారు. వరదనీటిలో పలువురు గల్లంతు అయ్యారు.మధ్య టెన్నెస్సీ నగరంలో వరదల ధాటికి వందలాది ఇళ్లు నీట మునిగాయి.
వరద సహాయక చర్యల్లో భాగంగా అత్యవసర కార్మికులు ఇంటింటి గాలింపు చేపట్టారని హుంపీరీస్ కౌంటీ స్కూలు హెల్త్ అండ్ సేఫ్టీ సూపర్ వైజర్ క్రిస్టీ బ్రౌన్ చెప్పారు. వరదల్లో మృతులు, గల్లంతు అయిన వారి పేర్లను ఎమర్జెన్సీ సెంటరులో బోర్డుపై,సిటీ డిపార్టుమెంటు ఫేస్ బుక్ పేజీలో ఉంచారు. వరదల వల్ల తండ్రి చేతుల్లోనే ఇద్దరు కవల పిల్లలు మరణించిన ఘటన అందరినీ కలిచివేసింది. టెన్నెస్సీలో గత 24 గంటల్లో 43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని హుంపీరీస్ కౌంటీ అధికారులు చెప్పారు.