Assam CM మదర్సా వ్యాఖ్యాలపై Owaisi కౌంటర్
ABN , First Publish Date - 2022-05-24T17:21:51+05:30 IST
పాఠశాలలు పెట్టి ఖురాన్ను బోధించాల్సిన అవసరం లేదు. ఖురాన్ గురించి చెప్పాలనుకుంటే ఇంట్లో చెప్పండి. మీ పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, సైంటిస్ట్లు కావాలి. అలా కావాలంటే సైన్స్, మాథ్స్, బయోలజీ, బోటనీ, జూలజీ లాంటివి చదవాలి. ఈ చదువులు అన్ని పాఠశాలల్లో..
హైదరాబాద్: మదర్సా(madrassa)లను మూసివేయాలంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ(Assam chief minister Himanta Biswa Sarma) చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం(AIMIM) అధినేత అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంఘ్ పరివార్ శాఖల్లోలాగ మదర్సాల్లో విధ్వేషం నేర్పడం లేదని సానుభూతి, ఆత్మగౌరవం నేర్పిస్తారని ఆయన అన్నారు. అంతే కాకుండా దేశ స్వాతంత్ర్య పోరాటాన్ని ఓవైసీ ప్రస్తావిస్తూ ఆ సమయంలో ముస్లింలు బ్రిటిషర్లను ఎదుర్కోనే పోరాటంలో ఉంటే ఆర్ఎస్ఎస్ వారు బ్రిటిషర్ల ఏజెంట్లుగా వ్యవహరించారంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హిమంత బిశ్వా శర్మ మాట్లాడుతూ ‘‘పాఠశాలలు పెట్టి ఖురాన్ను బోధించాల్సిన అవసరం లేదు. ఖురాన్ గురించి చెప్పాలనుకుంటే ఇంట్లో చెప్పండి. మీ పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, సైంటిస్ట్లు కావాలి. అలా కావాలంటే సైన్స్, మాథ్స్, బయోలజీ, బోటనీ, జూలజీ లాంటివి చదవాలి. ఈ చదువులు అన్ని పాఠశాలల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఖురాన్లు బోధించే మదర్సాలు అక్కర్లేదు. ఇక నుంచి ఆ పదం ఉనికిలో ఉండకూడదు’’ అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఓవైసీ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘మదర్సాల్లో సైన్స్, మాథ్స్, సోషల్ అన్నీ చెప్తారు. శాఖల్లాగ కాదు, అక్కడ (మదర్సా) ఆత్మగౌరవాన్ని నేర్పిస్తారు, సానుభూతి నేర్పిస్తారు. చదువులేని సంఘీలకు ఇది అర్థం కాదు. హిందూ సంఘసంస్కర్త రాజా రాం మోహన్ రాయ్ చదువుకున్నది మదర్సాలోనే. ఆయన అక్కడ ఎందుకు చదువు చదువుకున్నారో వాళ్లకి అర్థం కాదు. దేశ స్వాతంత్ర్యం కోసం ముస్లింలు పోరాడుతుంటూ సంఘీలు బ్రిటిషు ఏజెంట్లలా వ్యవహరించారు. ముస్లింలు భారతదేశాన్ని సుసంపన్నం చేశారు. అది కొనసాగుతుంది కూడా’’ అని అన్నారు.