బందరు ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత
ABN , First Publish Date - 2021-04-24T05:27:08+05:30 IST
బందరు ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత
బెడ్లు దొరక్క కరోనా బాధితుల హాహాకారాలు
ఒక్కసారిగా పెరిగిన బాధితులతో ఇబ్బందులు
మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 23 : మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ల కొరత తీవ్రస్థాయికి చేరింది. 250 పడకల ఆసుపత్రిగా రూపొందించినప్పటికీ ప్రస్తుతం 270 మంది బాధితులు చేరారు. ఒక్కసారిగా ఊహించని విధంగా బాధితులు శుక్రవారం పెద్దసంఖ్యలో రావడంతో వైద్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కొందరు వైద్యులు, నర్సులు కరోనా బారినపడటంతో ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పనిభారం పడుతోంది.
లిక్విడ్ ఆక్సిజన్ లేక ఇబ్బందులు
ఆసుపత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆక్సిజన్ సిలిండర్లపైనే వైద్యం చేస్తున్నారు. బెడ్లు దొరకని బాధితులు ఆసుపత్రి బయట తిరుగుతున్నారు. దీంతో చుట్టుపక్కల పరిస్థితి భయానకంగా మారింది. కొందరు పలుకుబడి ఉన్నవారు రాజకీయ నాయకులతో ఫోన్లు చేయిస్తుండటంతో ఆసుపత్రి ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన మూడు రోజులకే అవనిగడ్డకు చెందిన ఓ మహిళ మృతిచెందడంతో పరిస్థితులు మరింత భయాందోళనగా మారాయి. కాగా, వైద్యులు, నర్సులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు. బాధితులకు ఇంజక్షన్లు, మందులు ఇవ్వడానికి పీపీఈ కిట్లు ధరించి వెళ్తున్నారు. శుక్రవారం మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కృష్ణమూర్తి ఆసుపత్రికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు.
మరో వార్డులో 20 పడకలు ఏర్పాటు చేస్తాం..
ఆసుపత్రికి ఊహించని విధంగా కరోనా బాధితులు వచ్చారు. దీంతో పడకలు ఏర్పాటు చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. గతంలో క్షయవ్యాధి వార్డులోని రోగులను వేరే ప్రదేశానికి పంపి ఇప్పుడు ఆ వార్డులో 20 నుంచి 40 పడకలు ఏర్పాటుచేసి పాజిటివ్ వచ్చిన రోగులకు చికిత్స ప్రారంభించాం. మూడు షిఫ్టుల్లో వైద్యులు, నర్సులు పనిచేస్తున్నారు.
- డాక్టర్ మల్లికార్జునరావు, ఆర్ఎంవో
ఉన్నవారితోనే పనిచేస్తున్నాం..
ఆసుపత్రిలో ఉన్న వైద్యులతోనే వైద్యం చేస్తున్నాం. మందుల కొరత లేదు. లిక్విడ్ ఆక్సిజన్ కోసం ఉన్నతాధికారులకు ఫోన్ చేశాం. వెంటనే పంపుతామన్నారు.
- డాక్టర్ మాధవీలత, ఆసుపత్రి సూపరింటెండెంట్