ఆక్సిజన్ ట్యాంకర్ దారిమళ్లింపు
ABN , First Publish Date - 2021-05-09T05:26:25+05:30 IST
జిల్లాలో కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ సరఫరా దినదినగండంగా మారింది. నిత్యం ఒక ట్యాంకర్ ఆక్సిజన్ అయినా వస్తేనే తప్ప ఇక్కడి అవసరాలు తీరే పరిస్థితి లేదు. అయితే అలా రాకపోయినా, వచ్చే ట్యాంకర్ కాస్తంత ఆలస్యమైనా అటు అధికారులు, ఇటు వైద్యులు టెన్షన్ పడాల్సి వస్తుండగా ఇక బాధితులు పరిస్థితి గాలిలో దీపంలాగే ఉంటోంది. గత బుధ, గురువారాల్లో ఆక్సిజన్ కోసం గందరగోళం ఏర్పడగా తాజాగా శుక్రవారం రాత్రి కూడా మరోసారి టెన్షన్ నెలకొంది.
అర్ధరాత్రి అధికారుల హైరానా
గుంటూరు జీజీహెచ్కు చేరినట్లు గుర్తింపు
తీవ్రవత్తిడి తెచ్చి ఉదయానికి తెప్పించిన వైనం
ఈలోపు అత్యవసరానికి ఏజెన్సీ నుంచి సరఫరా
దినదినగండంగా కొవిడ్ బాధితులకు ఆక్సిజన్
ఒంగోలు, మే8 (అంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ సరఫరా దినదినగండంగా మారింది. నిత్యం ఒక ట్యాంకర్ ఆక్సిజన్ అయినా వస్తేనే తప్ప ఇక్కడి అవసరాలు తీరే పరిస్థితి లేదు. అయితే అలా రాకపోయినా, వచ్చే ట్యాంకర్ కాస్తంత ఆలస్యమైనా అటు అధికారులు, ఇటు వైద్యులు టెన్షన్ పడాల్సి వస్తుండగా ఇక బాధితులు పరిస్థితి గాలిలో దీపంలాగే ఉంటోంది. గత బుధ, గురువారాల్లో ఆక్సిజన్ కోసం గందరగోళం ఏర్పడగా తాజాగా శుక్రవారం రాత్రి కూడా మరోసారి టెన్షన్ నెలకొంది. ఒంగోలు రిమ్స్కు విఽశాఖ నుంచి వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ మధ్యలో దారి మళ్లడం, తెల్లవారేలోపు ఆక్సిజన్ రాకపోతే రిమ్స్లో పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉండటంతో అర్ధరాత్రి అధికారులు హైరానా పడ్డారు.
ప్రైవేటు ఏజెన్సీ నుంచి ట్యాంకర్ తెప్పించి..
కాగా ఒంగోలు రిమ్స్లో శుక్రవారం 16 టన్నుల ఆక్సిజన్ అందుబాటులో ఉండగా మరో 16 టన్నులు ట్యాంకర్ వస్తుందన్న సమాచారం అధికారులకు ఉంది. అలా వస్తే ఇబ్బంది ఉండదన్న ధీమాతో విశాఖ నుంచి ఒంగోలుకు బయలుదేరిన ట్యాంకర్ను ఎప్పటికప్పుడు ఎక్కడి దాకా వచ్చిందనేది తెలుసుకుంటున్నారు. జిల్లా సరిహద్దులోకి వచ్చాక దారిమళ్ళకుండా ఎస్కార్ట్ కూడా ఏర్పాటుచేశారు. అయితే మధ్యాహ్నం 12 గంటలకు విశాఖలో బయలుదేరిన ట్యాంకర్ విజయవాడ వచ్చేవరకు ఇక్కడి అధికారులకు సమాచారం ఉంది. ఆ తర్వాత ఏమైందో అర్ధరాత్రికి కూడా ఒంగోలు చేరలేదు. దీంతో ట్యాంకర్ దారిమళ్లిందని గమనించిన జేసీ చేతన్, ఆక్సిజన్ నోడల్ అధికారి అయిన వైద్యఆరోగ్యశాఖ ఈఈ రవిలు ట్యాంకర్ జాడ కోసం వెతుకులాట ప్రారంభించారు. మరోవైపు పోలీసులు కూడా ఇతర జిల్లాల వారిని విచారించడం ప్రారంభించారు. అలా చాలాసేపు ట్యాంకర్ జాడ తెలియక అధికారులు టెన్షన్ పడ్డారు. సమయం గడిచే కొద్దీ రిమ్స్లో ఉన్న ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోతుండగా తెల్లవారేలోపు అందించకపోతే బాధితుల పరిస్థితి ఇబ్బందికరంగా మారేలా ఉంది. దీంతో ప్రత్యామ్నాయంగా గ్రోత్ సెంటర్లోని ప్రైవేటు ఏజెన్సీ వద్ద పరిస్థితిని సేకరించారు. అదేసమయంలో ఏజెన్సీకి 12టన్నుల ట్యాంకర్ వచ్చి అక్కడి స్టోరేజి ట్యాంకులో నింపుతున్నట్లు తెలుసుకుని, తక్షణం దానిని ఒంగోలు రిమ్స్కు తెప్పించి 4 టన్నుల ఆక్సిజన్ను ఇక్కడి స్టోరేజి ట్యాంకులోకి చేర్చారు.
గుంటూరు జీజీహెచ్లో ట్యాంకర్
ఈలోపు విశాఖ నుంచి ఒంగోలు వస్తూ దారిమళ్లిన ట్యాంకర్ గుంటూరు ప్రభుత్వాస్పత్రికి చేరినట్లు గుర్తించారు. డైవర్తో ఇక్కడి అధికారులు మాట్లాడగా హైవేపై వస్తున్న సమయంలో గుంటూరు ఉత్తర బైపాస్ వద్ద అక్కడి పోలీసులు ట్యాంకర్ను అడ్డగించి గుంటూరు జీజీహెచ్కి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీంతో జేసీ చేతన్, ఈఈ రవిలు రంగంలోకి దిగి గుంటూరు ఆసుపత్రి అధికారులతో మాట్లాడారు. గుంటూరులో కూడా ఆక్సిజన్ కొరత ఉండటంతో ముందుజాగ్రత్తగా ఒంగోలు వచ్చే ట్యాంకర్ను అక్కడి పోలీసులు సాయంతో ఆపినట్లు సమాధానమిచ్చారు. అయితే ఒంగోలు రిమ్స్లో పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వివరించి వారిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవడం ద్వారా తెల్లవారుజాముకు అక్కడి నుంచి ట్యాంకర్ ఒంగోలు బయలుదేరేలా చేయగలిగారు. ఆ ట్యాంకర్ శనివారం ఉదయం 7గంటలకు రిమ్స్ చేరడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.