భవిష్యత్తులో భూమిపై ఆక్సిజన్‌ మాయం!

ABN , First Publish Date - 2021-03-06T08:16:47+05:30 IST

భూమిపై మరో వంద కోట్ల సంవత్సరాల తర్వాత ఆక్సిజన్‌ ఉండదా? ఈ అతి పెద్ద జీవావాసంపై ప్రాణి మనుగడే ప్రమాదంలో పడనుందా? అంటే.. ఔననే అంటోంది ఓ అధ్యయనం. ప్రకృతి విధ్వంసం ఇలాగే కొనసాగితే..

భవిష్యత్తులో భూమిపై ఆక్సిజన్‌ మాయం!

వంద కోట్ల ఏళ్లలో జీవరాశి మనుగడ కష్టమే!


న్యూఢిల్లీ, మార్చి 5: భూమిపై మరో వంద కోట్ల సంవత్సరాల తర్వాత ఆక్సిజన్‌ ఉండదా? ఈ అతి పెద్ద జీవావాసంపై ప్రాణి మనుగడే ప్రమాదంలో పడనుందా? అంటే.. ఔననే అంటోంది ఓ అధ్యయనం. ప్రకృతి విధ్వంసం ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో భూమిపై జీవరాశికి ఎదురవబోయే ప్రమాదాలపై టోక్యో యూనివర్సిటీ, జార్జియా టెక్‌ సంయుక్తంగా ఓ అధ్యయనం నిర్వహించాయి. దీని ప్రకారం.. మరో 10 వేల సంవత్సరాల్లో భూమిపై ఆక్సిజన్‌ స్థాయి ఇప్పుడున్న దాంట్లో 10 లక్షల వంతులు తగ్గిపోతుంది. జీవరాశి మనుగడకు అనుకూలమైన భూ వాతావరణం కాల పరిమితిని 108 కోట్ల సంవత్సరాలుగా తాము గుర్తించామని ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు తెలిపారు. కోట్ల సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ క్రమంగా సూర్యుడిపై వేడి విపరీతంగా పెరుగుతుందని, దీనివల్ల భూ వాతావరణం వేడెక్కి.. కార్బన్‌డయాక్సైడ్‌ అణువులు విచ్ఛిన్నమవుతాయన్నారు. దీనివల్ల, భూమిపై కార్బన్‌డయాక్సైడ్‌ తగ్గిపోయి.. చెట్లు నశిస్తాయని, ఈ క్రమంలోనే ఆక్సిజన్‌ స్థాయి దారుణంగా పడిపోతుందని చెప్పారు. మరి భూ వాతావరణం కాలపరిమితిని మరింతగా పెంచుకునే అవకాశమే లేదా? అంటే.. ఉందంటున్నారు పరిశోధకులు. పర్యావరణాన్ని కాపాడుకోవడాన్ని ఓ బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ ప్రవర్తిస్తే పరిస్థితులు మెరుగుపడతాయని ఈ అధ్యయనం తెలిపింది. 

Updated Date - 2021-03-06T08:16:47+05:30 IST