త్వరలో పాదయాత్ర చేస్తా...

ABN , First Publish Date - 2021-12-07T18:47:31+05:30 IST

ఖానాపుర నియోజకవర్గ అభివృద్ధి కోసం ఛలో సువర్ణసౌధ పేరిట పాదయాత్ర చేయదలిచినట్టు ఎమ్మెల్యే అంజలి నింబాళ్కర్‌ వెల్లడించారు. సోమవారం బెళగావిలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈనెల 13నుంచి

త్వరలో పాదయాత్ర చేస్తా...

బెంగళూరు: ఖానాపుర నియోజకవర్గ అభివృద్ధి కోసం ఛలో సువర్ణసౌధ పేరిట పాదయాత్ర చేయదలిచినట్టు ఎమ్మెల్యే అంజలి నింబాళ్కర్‌ వెల్లడించారు. సోమవారం బెళగావిలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈనెల 13నుంచి సువర్ణసౌధలో శాసనసభ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో పాదయాత్ర చేపట్టదలిచానన్నారు. 12న మధ్యాహ్నం ఖానాపుర నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానన్నారు. 40కిలోమీటర్ల దూరాన ఉండే సువర్ణసౌధకు 13న చేరుకుంటామన్నారు. ఖానాపుర సంఘర్ష పేరిట యాత్ర సాగుతుందన్నారు. అకాల వర్షాలతో ఖానాపుర తాలూకాలో 3,632 హెక్టార్ల ప్రదేశంలో వరి దెబ్బతిందన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిబంధనల ప్రకారం ఎకరాకు రూ.2720 పరిహారం ఇవ్వాల్సి ఉందన్నారు. ఎకరంలో వరిసాగుకు రూ.15వేలు ఖర్చు కానుందని ఇది రైతులకు అన్యాయం కాదా..? అని ప్రశ్నించారు. ఖానాపుర పరిధిలో 66 పాఠశాలలకు సంబంధించి 255 తరగతి గదులు దెబ్బతిన్నాయని ఇటీవలి రెండు నెలల్లో వందకుపైగా ఇళ్లు కూలాయన్నారు. ఖానాపుర తాలూకాకు సమగ్రంగా ఆర్టీసీ సర్వీసులు లేవని తద్వారా విద్యార్థులు, ప్రజలు రోజూ ఇబ్బంది పడుతున్నారన్నారు. 820 కిలోమీటర్ల మేర పంచాయతీ రోడ్లు, 23 కల్వర్టులు దెబ్బతిన్నాయన్నారు. ఖానాపురకు నిధులు రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. వెంటనే నిధులు విడుదల చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకే నియోజకవర్గ పరిధిలోని ప్రజలతో కలసి పాదయాత్ర జరుపుతామన్నారు. 

Updated Date - 2021-12-07T18:47:31+05:30 IST