అమరావతే ఏకైక రాజధాని
ABN , First Publish Date - 2022-09-25T06:50:55+05:30 IST
అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలంటూ అమరావతి టు అరసవల్లి వరకు అమరావతి రైతుల చేపట్టిన రైతుల మహాపాదయాత్రకు గుడివాడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
ముక్తకంఠంతో నినదించిన గుడివాడ
గుడివాడ : అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలంటూ అమరావతి టు అరసవల్లి వరకు అమరావతి రైతుల చేపట్టిన రైతుల మహాపాదయాత్రకు గుడివాడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పట్టణ ప్రజలతో పాటు గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు, నందివాడ మండలాల రైతాంగం పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు. మహిళలు పూలవర్షం కురిపిస్తూ హారతులు పట్టారు. అమరావతే ఒకైక రాజధాని అంటూ గుడివాడ ప్రజలు ముక్తకంఠంతో నినదించారు. మహాపాదయాత్రను తిలకించేందుకు పట్టణవాసులు దారిపొడవునా బారులు తీరారు. మాజీ ఎమ్మేల్యే రావి వెంక టేశ్వరరావు నేతృత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కౌతవరం నుంచి పాదయాత్ర ముగిసే కళాశాల వరకు సాగారు. గుడివాడ అర్బన్ బ్యాంకు చైౖర్మన్ పిన్నమనేని పూర్ణవీరయ్య(బాబ్జీ), మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు పాల్గొని శ్రేణులను పాదయాత్రలో పాల్గొన్న వారిని ఉత్సాహపరిచారు.