ధాన్యాన్ని 12 గంటల్లో అన్‌లోడ్‌ చేయాలి

ABN , First Publish Date - 2021-05-11T05:25:24+05:30 IST

కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లుకు చేరిన ధాన్యాన్ని 12 గంటల్లో అన్‌లోడ్‌ చేయకుంటే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ రైస్‌మిల్‌ యజమానులను హెచ్చరించారు.

ధాన్యాన్ని 12 గంటల్లో అన్‌లోడ్‌ చేయాలి

అధిక సంఖ్యలో హమాలీలను నియమించుకోవాలి

రైస్‌మిల్లర్లకు మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ నిర్ధేశం


మెదక్‌, మే 10: కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లుకు చేరిన ధాన్యాన్ని 12 గంటల్లో అన్‌లోడ్‌ చేయకుంటే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని  మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ రైస్‌మిల్‌ యజమానులను హెచ్చరించారు. మెదక్‌, కొల్చారం మండలాల్లో పలు రైస్‌మిల్లులను అదనపు కలెక్టర్‌ రమే్‌షతో కలసి సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్నిచర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లోనే ధాన్యాన్ని విక్రయించేందుకే కొనుగోలుకేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల నుంచి వడ్లను తెచ్చిన లారీలను త్వరగా అన్‌లోడ్‌ చేసేందుకు మిల్లర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం అధిక సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతీరోజు ధాన్యం అన్‌లోడ్‌ ప్రక్రియ సాగుతున్నతీరుపై మిల్లులవారీగా సమీక్ష నిర్వహిస్తామన్నారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దించుకొని లారీలను తిరిగి ఆయా కేంద్రాలకు పంపాలని సూచించారు. జిల్లాలో రైస్‌మిల్లులను ప్రతీనిత్యం తనిఖీ చేస్తామని స్పష్టం చేశారు. నిబందనలను ఉల్లంగిస్తే మిల్లు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


అధికారుల తీరుతోనే ఆలస్యం

మెదక్‌ రూరల్‌, మే 10: మిల్లుకు వచ్చే ధాన్యాన్ని వెంటనే  ఖాళీచేసి, ఏ కేంద్రం నుంచి వచ్చిన లారీని తిరిగి అక్కడికే పంపాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన తన చాంబర్‌ నుంచి ఆర్డీవోలు, తహశీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు, మిల్లర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా కొనుగోలు కేంద్రాలకు ఏర్పాటు నుంచి  రైతుల ఖాతాలో డబ్బులు జమచేసేవరకు వివిధ స్థాయిలో అధికారులను నియమిస్తూ పటిష్టమైన ప్రణాళికను రూపిందించామని, కానీ కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా  మిల్లుల్లో ధాన్యం లారీలు ఆన్‌లోడ్‌ కావడంలేదని కలెక్టర్‌ మండిపడ్డారు. కొల్చారంలోని సత్యసాయి రైస్‌మిల్లును తాను స్వయంగా తనిఖీ చేయగా.. అక్కడ సుమారు వంద లారీలు ఆన్‌లోడ్‌ చేయడం కోసం ఎదురుచూస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో చాలా మిల్లుల వద్ద ఇదే పరిస్థితి ఆయన మండిపడ్డారు. తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు తమ పరిధిలోని మిల్లుల వద్ద ధాన్యంతో వచ్చిన లారీలను త్వరగా ఖాళీచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీఆర్‌పీసీ 133 సెక్షన్‌ ప్రకారం తమకున్న అధికారలను ఉపయోగించాలని ఆయన సూచించారు. మండల ఇన్‌చార్జి అధికారులు, డీపీఎంలు లారీల కొరతఉన్న కేంద్రాల్లో ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తరలించడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తహసీల్దార్లు సమన్వయం చేయాలని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లు, తరలింపుపై ప్రతీ రెండుగంటలకు ఓసారి వివరాలను తనకు  తెలియజేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. 

Updated Date - 2021-05-11T05:25:24+05:30 IST