పాడేరు- రంపచోడవరం బస్సు సర్వీసు ప్రారంభం
ABN , First Publish Date - 2022-05-26T06:36:04+05:30 IST
పాడేరు- రంపచోడవరం కొత్త బస్సు సర్వీసును స్థానిక పీటీడీ కాంప్లెక్స్లో బుధవారం ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి ప్రారంభించారు.
పాడేరురూరల్, మే 25: పాడేరు- రంపచోడవరం కొత్త బస్సు సర్వీసును స్థానిక పీటీడీ కాంప్లెక్స్లో బుధవారం ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ బస్సు సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. పీటీడీ డిపో జిల్లా మేనేజర్ రోణంకి సీతారాంనాయుడు మాట్లాడుతూ రంపచోడవరం వెళ్లే ఈ బస్సు రోజూ పాడేరు కాంప్లెక్స్ నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి చింతపల్లి, రొంపుల, కేడీపేట, కాకరపాడు, రాజవొమ్మంగి మీదుగా రంపచోడవరానికి రాత్రి 8 గంటలకు చేరుతుందన్నారు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు అక్కడ బయలుదేరి అదే మార్గంలో తిరిగి పాడేరుకు ఉదయం 11 గంటలకు చేరుకుందని చెప్పారు. ప్రస్తుతం ఒక సర్వీసును ప్రారంభించామని, రద్దీని బట్టి మరో సర్వీసును ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యుడు టి.నరసింగరావు, వైసీపీ నాయకులు, పీటీడీ యూనియన్ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.