కొనుగోలు చేయకపోతే ఆందోళన: కాంగ్రెస్
ABN , First Publish Date - 2021-04-23T05:13:50+05:30 IST
ఈ యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఆందోళనకు సిద్ధమని మండల కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.
కల్లూరు, ఏప్రిల్ 22: ఈ యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఆందోళనకు సిద్ధమని మండల కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. గురువారం పుల్లయ్యబంజర్ గ్రామసమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు సందర్శించి పరిశీలించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెద్దబోయిన దుర్గాప్రసాద్, ఎంపీటీసీలు కొండూరి కిరణ్కుమార్, లక్కిరెడ్డి గోపిరెడ్డిలు విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ధాన్యం కేంద్రాలు ఏర్పాటుచేసిందే కానీ ఆచరణలో ఏమాత్రం అది అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. కల్లూరు మండలంలో 30కేంద్రాలు ఏర్పాటుచేశారే కానీ ఒక్క కేంద్రంలో కూడా కొనుగోలు ప్రక్రియ ఏమాత్రం జరగటం లేదన్నారు. గన్నీసంచులు, లారీల కొరత, మిల్లర్ల నిరాకరణతో రైతులు ధాన్యం కొనుగోళ్లు లేక కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారన్నారు. కేంద్రాల ఏజన్సీ నిర్వాహాకులు కూడా ఏమీచేయలేకపోతున్నారని జిల్లా అధికారులు కేంద్రాలను పరిశీలించి ధాన్యం కొనుగోలు చేస్తామని హామీలిస్తున్నారే కానీ తిరిగి వాటిపై దృష్టిసారించటం లేదని విమర్శించారు. జిల్లా అధికార యంత్రాంగం స్పందించి రైతులను ఆదుకోకపోతే రైతుల పక్షాన ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెద్దబోయిన వెంకటేశ్వరరావు, తేళ్లూరి కృష్ణ, లింగపోగు కృష్ణ, ఎస్డీ.చోటు పాల్గొన్నారు.